సిటీబ్యూరో, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేసే విధంగా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులోకి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ముందస్తు ప్రణాళికలతో దివ్యాంగుల ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా బల్దియా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాలు, ఎలక్ట్రోరల్ సమస్యలతో పాటు వారి రాకపోకలు, పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై ప్రత్యేకంగా చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ వద్దకు దివ్యాంగుల తీసుకువచ్చేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 24,163 మంది ఓటర్లు ఉండగా, అత్యధికంగా పురుషులే ఉన్నారు. ఈ క్రమంలో వారికి అవసరమైన రవాణా, పోలింగ్ స్టేషన్ల వద్ద ర్యాంపులు, ప్రత్యేకమైన మరుగుదొడ్లు, తాగునీటి వసతులతో పాటుగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఐదు థీమ్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి దివ్యాంగులు, వృద్ధులు ఒక్క రోజు ముందుగానే ఇంటి వద్దనే ఉండి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తుండగా, దీంతో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇంటి వద్ద ఓటేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవడం, బూత్ లెవల్లోనే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే లోక్సభ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. 2018 ఓటర్ జాబితా ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే 31 వేల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మొత్తంలో ఓట్లు 12,933 మాత్రమే. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఇదే తీరుగా ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలో ఓటింగ్ శాతాన్ని 60 శాతానికి పెంచేలా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 24,163 మంది ఓటర్లు ఉండగా, అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక చర్యలతో వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో సుమారు లక్షన్నర ఓటర్లుండగా… ప్రతి నియోజకవర్గంలో ఆయా పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న దివ్యాంగుల ఓటర్ల సంఖ్యను బట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు తెలిపారు.