సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): నగర ఔటర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ చుట్టూ పలు చోట్ల విస్తరణ పనులు చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలోని ఓఆర్ఆర్ చుట్టూ సర్వీసు రోడ్లను 2 నుంచి 4 వరుసలకు విస్తరించే పనులు పురోగతిలో ఉన్నాయి.
తాజాగా శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి వైపు ఉన్న తొండుపల్లి వద్ద కిందకు వెళ్లే రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. రెండు వైపుల నుంచి వచ్చే భారీ వాహనాలతో పాటు , బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు దిగేందుకు మూడు వరుసలు ఉన్న మార్గం సరిపోవడం లేదు. దీన్ని ప్రస్తుత అవసరాలే కాకుండా, భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఎగ్జిట్ మార్గాన్ని విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు 6.5 గుంటల స్థలాన్ని భూసేకరణ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఓఆర్ఆర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్, భూసేకరణ అధికారి విస్తరణ పనులకు అవసరమైన భూమిని గుర్తించారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.