సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జైలు నుంచి విడుదల కాగానే బైక్ను దొంగిలించి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. తాళాలు ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఈస్ట్జోన్ డీసీపీ సునీల్దత్ బషీర్బాగ్లోని పాత నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మనుకొండ అనిల్ కుమార్ 2010 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించగా పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు. గతేడాది నవంబర్ 26న బయటికి రాగానే తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ధనవంతులు ఉండే కాలనీల్లో రెక్కీలు నిర్వహిస్తూ తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి చోరీలు చేస్తున్నాడు. చోరీ సొత్తను బోడుప్పల్ నివాసి కార్తీక్ను విక్రయించాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా కొన్నాళ్లపాటు గోవా, బెంగళూర్కు వెళ్లి జాలీగా తిరిగాడు. నిందితుడికి శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఇచ్చాపురం గోపి సహకరించాడు.
ఇలా చిక్కారు..
ఇటీవల మలక్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం జరగ్గా.. టాస్క్ఫోర్స్ సౌత్జోన్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, మలక్పేట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అనిల్కుమార్, గోపి పోలీసులకు చిక్కారు. వీరిద్దరిని విచారించి 690 గ్రాముల బంగారు నగలు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన కార్తీక్ పరారీలో ఉన్నాడు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిందితులు మలక్పేట్తో పాటు వరంగల్లోని సుబేదారి పోలీస్స్టేషన్, విశాఖపట్టణంలోని ద్వారాక పీఎస్, నర్సిపట్నం పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు.