హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రేపట్నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జంట నగరాల పరిధిలో నడిచే 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
రేపట్నుంచి 17వ తేదీ వరకు మరో 15 రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, ఉందానగర్, మేడ్చల్, బొల్లారం స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందానగర్ – సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజర్ రైలు రద్దు అయింది. సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైలను కూడా రద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు- విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.