సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్- మహబూబ్నగర్ రైల్వే లైన్ పరిధిలో విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన 29.7 కిలో మీటర్ల దూరం ఉన్న ఉందానగర్- షాద్నగర్ మధ్య సెక్షన్లో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ లైనును సోమవారం ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. హైదరాబాద్, మహబూబ్నగర్, కర్నూల్, అనంతపూర్, బెంగళూరు, కడప, తిరుపతి మొదలైన దక్షిణాదికి చెందిన నగరాల మధ్య రైల్వేను అనుసంధానించడంలో ముందడుగు పడిందన్నారు. ఈ ప్రాజెక్టు రైల్వే పీఎస్యూ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- మహబూబ్నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే కీలకమైనది. ఈ ప్రాజెక్టు 88 కిలో మీటర్లు ఉన్నది. మొత్తం రూ.774కోట్ల అంచనా వ్యయంతో 2015-16 మంజూరైనట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- ఉందానగర్ మధ్య 28 కిలో మీటర్ల దూరానికి సంబంధించిన పనులను ఈ ప్రాజెక్టుకు సంబంధం లేకుండా.. ఎంఎంటీఎస్ ఫేజ్-1, ఫేజ్-2లో భాగంగానే పూర్తి చేశామని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. ఈ మేరకు ఉందానగర్- మహబూబ్నగర్ స్టేషన్ల మధ్య షాద్నగర్- గొల్లపల్లి సెక్షన్ మధ్య 29 .7కిలో మీటర్ల పనులు పూర్తయ్యాయన్నారు.