మణికొండ/గాజులరామారం, జనవరి 5 : నగర శివారులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బాటసారులపై కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి పరిధిలోని రక్తమైసమ్మ దేవాలయ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న కోకాపేటకు చెందిన తులసీ కుమార్ను దుండగులు కత్తులతో బెదిరించి, అతడి జేబులోంచి రూ.15వేలు తీసుకొని, దాడిచేశారు. బాధితుడు డయల్ 100కు సమాచారమిచ్చాడు. ఈ ఘటన జరిగిన కొంత సేపటికే అవుటర్ సర్వీసు రోడ్డు నుంచి మంచిరేవుల వెళ్లే దారిలో రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్న ముగ్గురు ట్రాన్స్జెండర్లపై సదరు దుండగులు లైంగిక దాడికి యత్నించారు. ఇందుకు ట్రాన్స్జెండర్స్ ప్రతిఘటించారు. విషయాన్ని ఓ ట్రాన్స్జెండర్ తన భర్త కిశోర్ కుమార్రెడ్డ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఇదిలా ఉండగా, తులసీకుమార్ ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులను చూసిన దుండగులు పారిపోయారు. పోలీసులు వివరాలు సేకరించి ట్రాన్స్జెండర్లను అక్కడి నుంచి పంపించారు. పోలీసులు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొంత సేపటికి ట్రాన్స్జెండర్ భర్త కిశోర్రెడ్డి (26) తన స్నేహితుడు శివరాజ్తో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నాడు. అక్కడ ట్రాన్స్జెండర్స్ కనిపించకపోవడంతో వెతుకుతూ అవుటర్ సర్వీసు రోడ్డు వైపు వెళ్లారు. చెట్ల పొదల్లో దాగివున్న సదరు దుండగులు.. కిశోర్రెడ్డి, శివరాజ్పై దాడిచేసి, పారిపోయారు. శివరాజ్ 100కు కాల్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితులిద్దరిని హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ కిశోర్రెడ్డి మృతి చెందాడు. దాడిచేసిన దుండగులు సిక్కులుగా ఉన్నారంటూ శివరాజ్ పోలీసులకు తెలిపాడు. తులసీ కుమార్పై కూడా దాడి చేసింది వారేనంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎస్వోటీ పోలీసులపై దారిదోపిడీ దుండగుల దాడి
ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
నార్సింగ్లో దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు వెళ్లిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులపై దాడి జరిగింది. దుండగుడి దాడిలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిని జగద్గిరిగుట్ట పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. నార్సింగ్లో దారి దోపిడీలు, దాడులకు పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసు బృందం రంగంలోకి దిగింది. బాధితుల నుంచి సేకరించిన సమాచారం, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు జగద్గిరిగుట్ట పరిధిలోని సిక్కుల బస్తీలో ఉన్నట్టు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు.. పలు ప్రాంతాల్లో గాలించి ఆచూకీ కనుగొన్నారు. నిందితుడు సర్దార్ కరణ్ సింగ్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన కరణ్సింగ్ తనవద్దనున్న కత్తితో కానిస్టేబుళ్లు రాజు నాయక్, విజయ్పై దాడి చేశాడు. గాయపడిన పోలీసులిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాజు నాయక్ ఛాతిలో కత్తి పోటు పడిందని, అతడి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు కరణ్సింగ్ను జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.