మేడ్చల్ మల్కాజ్గిరి : కల్తీ రాగి పిండి తయారు చేస్తున్న ఓ కేంద్రంలో మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పంచవటి కాలనీలోని రోడ్ నంబర్ 2లోని ఓ ఇంట్లో కల్తీ రాగి పిండి తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యం, రాగులను మిక్స్ చేసి పిండిని తయారు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని మేడిపల్లికి చెందిన బాల సంజీవ(42)గా పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రంలో నిల్వ ఉన్న 2.8 టన్నుల రేషన్ బియ్యం, 500 గ్రాముల చొప్పున ఉన్న 350 పాకెట్ల కల్తీ రాగి పిండి, 300 కిలోల రేషన్ బియ్యం పిండి, 240 కేజీల కల్తీ రాగి పిండి, ఒక వెయింగ్ మెషిన్, ఒక ప్యాకింగ్ మెషిన్తో పాటు ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాల సంజీవను అదుపులోకి తీసుకున్నారు.