సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): భారత్లో డ్రగ్స్ దందా చేస్తున్న ఆఫ్రికన్ దేశానికి చెందిన కొందరు యువకులు.. ఇక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. తాము వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ విలాసవంతంగా ఉన్నామంటూ తమ దేశంలోని పౌరులకు చెప్పుకుంటూ.. తమ షో పుటప్ను ఫొటోలు, వీడియోలలో చూపిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన కొందరు యువకులు ఆఫ్రికా నుంచి విద్యా, వ్యాపారం వీసాలతో ఇండియాకు వచ్చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిని డ్రగ్ మాఫియా తమ దందాలోకి దింపుతూ.. వారిని కూడా విలాసాలకు అలవాటు చేస్తున్నది. వచ్చిన పనిని వదిలేసి కొందరు డ్రగ్ మాఫియాలో సభ్యులుగా చేరుతూ దేశ వ్యాప్తంగా నెట్వర్క్ను సాగిస్తున్నారు. ఇలా సుమారు 3000 మంది వరకు ఈ నెట్వర్క్లో సభ్యులుగా ఉన్నట్లు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీ న్యాబ్) అనుమానిస్తున్నది. ఇదంతా విదేశాలలో ఉండే డ్రగ్ మాఫియా కన్నుసన్నల్లో నడుస్తున్నట్టు టీ న్యాబ్ గుర్తించింది.
నైజీరియా, సూడాన్, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు చదువులు, వ్యాపారం నిమిత్తం ప్రతి ఏడాది వచ్చే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. అలా వచ్చిన వారిలో కొందరు భారత్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపవచ్చనే భావనతో ఉంటున్నారు. ఇందుకు, అంతకు ముందే భారత్కు వచ్చి తిష్టవేసిన వాళ్లు చెప్పే మాటలు, వారి వ్యవహార శైలిని చూసి తాము కూడా అలాగే ఉండాలని ఫిక్స్ అవుతున్నారు. భారత్కు వచ్చిన ఆఫ్రికన్ యువతపై ఇక్కడున్న డ్రగ్ మాఫియా నిఘా పెడుతోంది. విదేశాల నుంచి రావడంతోనే విలాసవంతమైన జీవితాన్ని గడపడం కష్టం.. పార్ట్టైం జాబ్ చేసినా అంతగా డబ్బు సంపాదించలేరు.. అంటూ ఇక్కడ తిష్టవేసిన వారు చెబుతుంటారు. ఈలోపు డ్రగ్ మాఫియా సభ్యుల్లో ఎవరో ఒకరు వీరిని సంప్రదిస్తారు. కొన్ని రోజులు తమ వెంట తిప్పుకొని విలాసవంతమైన జీవితాన్ని చూపించి, అలవాటు చేస్తారు. వీరు మాఫియా దారిలోకి వచ్చేంత వరకు వెంబడిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో వారికి నమ్మదిగా డ్రగ్స్ కూడా అలవాటు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత డ్రగ్స్ను అమ్మిపెట్టాలని ఒక ఏజెంట్గా అతడిని వినియోగిస్తున్నారు. ఇలా నెమ్మదిగా విదేశాల నుంచి వస్తున్న యువతను డ్రగ్ మాఫియాలో ఒక సభ్యుడిగా చేర్చుకుంటున్నారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎవరు విక్రయిస్తున్నారో తెలియదు. ఇలాంటి వాళ్లంతా క్షేత్ర స్థాయిలో కస్టమర్లకు డ్రగ్ విక్రయించి, చేరవేస్తుంటారు. కొద్ది అనుభవం రాగానే వారిని ఇతర పట్టణాలకు పంపిస్తున్నారు.
విదేశాల నుంచి డ్రగ్స్ను వివిధ మార్గాల ద్వారా భారత్ లోపలికి పంపించే ప్రధాన డ్రగ్ మాఫియా తమ సరుకు ఎక్కువ స్థాయిలో అమ్ముడు పోయేలా చేస్తుంటారు. ఇందుకు ఎక్కువ మంది డ్రగ్ విక్రేతలు ఉంటే కస్టమర్లు కూడా ఎక్కువగా పెరిగి వేగంగా విక్రయాలు సాగుతాయనే భావనలో ఉంటారు. అయితే, ఇప్పుడు ఈ ముఠాలన్నీ హైదరాబాద్లో మాత్రం తమ నెట్వర్క్ను పెంచుకోవద్దని నిర్ణయించాయి. తెలంగాణ పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో నెట్వర్క్ మొత్తం పట్టుబడుతోందని, ఈ నేపథ్యంలోనే తెలంగాణ మినహా మిగతా ప్రాంతాల్లో విస్తరించుకోవాలంటూ డ్రగ్ మాఫియా తమ డార్కు నెట్లో చర్చించుకున్న విషయం తెలిసిందే.