అమీర్పేట్, డిసెంబర్ 29: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం సమీపంలో 1161 గజాల్లో బహుళ అంతస్తు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఈనెల 31న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేయనున్నారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. వారి వాహనాల పార్కింగ్ సమస్యగా ఉండేది. మంత్రి తలసాని చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించనున్నది.
1161 గజాల్లో బహుళ అంతస్తుల్లో పార్కింగ్
దేవాలయానికి సమీపంలో ఉన్న ఆలయానికి చెందిన 638 గజాల స్థలంతోపాటు దాని పక్కనే ఉన్న 523 గజాల జీహెచ్ఎంసీ స్థలాన్ని దేవాదాయ శాఖకు మంత్రి తలసాని బదిలీ చేయించారు. దీంతో మొత్తం 1161 గజాల్లో బహుళ అంతస్తుల్లో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి క్లియర్ చేశారు. జీ+3 పద్ధతిన నిర్మితమవుతున్న ఈ కాంప్లెక్స్లో 40 కార్లతోపాటు, 200 ద్విచక్ర వాహనాలకు సరిపోయేంత స్థలంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగనున్నది.
వసతి గృహాల నిర్మాణం
మొదటి, రెండో అంతస్తుల్లో 24 షాపులతోపాటు భక్తుల సౌకర్యార్థం 9 వసతి గదులు నిర్మించనున్నారు. ఈ విషయాలను మంత్రి తలసాని తన చాంబర్లో దేవాదాయ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఆరు నెలల్లో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని దేవాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున్ను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం రూ.6 లక్షల వ్యయంతో చేపట్టనున్న బోర్వెల్ పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ, దేవాదాయ శాఖ స్థపతి వల్లి నాయగం తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలి
బేగంపేట్, డిసెంబర్29: సీఎం సహాయ నిధిని అర్హు లు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. బేగంపేట్ డివిజన్కు చెందిన చంద్రశేఖర్, మల్లయ్య కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. వైద్య ఖర్చుల నిమిత్తం బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నాడు. మంత్రి చొరవతో బర్తన్ కాంపౌండ్కు చెందిన చంద్రశేఖర్కు రూ.1.50 లక్షలు, పాటిగడ్డ ఎంబీటీ నగర్కు చెందిన మల్లయ్యకు రూ.50 వేల ఎల్వోసీ పత్రాలను బుధవారం మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, నాయకులు శ్రీహరి, శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.