Airport Metro | సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ఎయిర్ పోర్టు మెట్రో పనులు ఒక్కోఅడుగు ముందుకు పడుతున్నాయి. సోమవారం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించే 31కి.మీ మార్గంలో మొత్తం 100 చోట్ల మట్టి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ చేపట్టింది. ఇప్పటికే మెట్రో అధికారులు ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్ట్ కోసం అలైన్ మెంట్, పెగ్ మారింగ్ పూర్తి చేశారు. తదుపరి దశగా భూసార పరీక్షలను చేపట్టామని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఐకియా నుంచి ప్రారంభమైన భూ సార పరీక్షలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 100 మెట్రో పిల్లర్ల స్థానాల్లో సుమారు 2 నెలల పాటు చేపడుతామని తెలిపారు.
రోడ్డు ఉపరితలం నుంచి దాదాపు 40 అడుగుల లోతు వరకు బోరు ద్వారా మట్టి నమూనాలను తీసుకొని భూసార పరీక్షలు చేస్తామన్నారు. అక్కడికక్కడే మట్టి పరీక్షలు చేయడంతో పాటు ప్రయోగశాలలోనూ మట్టి నమూనాల పరీక్షలు చేస్తామని, ఇలా రెండింటి ద్వారా భూసామర్థ్యాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. దీంతో స్తంభాల పునాధులు ఏమేరకు తవ్వాలి, ఓపెన్ ఫౌండేషన్, ఫైల్ ఫౌండేషన్ ద్వారా ఫిల్లర్ నిర్మాణం చేయాలా.. బేరింగ్ ప్రెజర్ ఎంత వరకు ఉంటుందన్న అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. అంతేకాకుండా టెండర్ ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు ప్రాజెక్టు నిర్మాణం జరిగే భూమి తీరుపై ఒక అవగాహన వస్తుందని చెప్పారు. చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బి.ఆనంద్మోహన్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సాయపరెడ్డి బృందం పర్యవేక్షణలో భూసార పరీక్షలు సమర్థవంతంగా చేపడుతున్నారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ప్రతిపాదించిన ఎయిర్పోర్టు మార్గంలో చేపట్టే భూసార పరీక్షల కోసం అవసరమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కలుగకుండా ఉండటంతో పాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన రహదారి మధ్యలో పిల్లర్ల గుంతలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.