దుండిగల్, ఏప్రిల్ 30: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు విచారణలో జాప్యంపై పోలీసుల తీరు వివాదస్పదమవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని మర్కాపురానికి చెందిన సీతారామ్కు నంద్యాలకు చెందిన యువతితో 2018లో వివాహమైంది. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అవడంతో సీతారామ్ హైదరాబాద్లోని బాచుపల్లిలో కాపురం పెట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్యాన్ని.. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే వార్త కకావికలం చేసింది.
ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సీతారాంను మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వెనుక పెద్ద కుట్ర ఉందా..? భర్తను అడ్డు తొలగించుకోవడానికి నిందితులే కావాలని ఆ వీడియోలను సీతారామ్కు చేరేలా చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి రెండు నెలలు గడిచినా కేసులో పురోగతి లేకపోవడం పట్ల భాదిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతున్నది. పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సీతారాం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తన భార్య పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చూసిన సీతారామ్.. మనోవేదనకు గురై ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 పేజీల లేఖరాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తదనంతరం సీతారాం తండ్రి బాచుపల్లి పీఎస్లో 11 మందిపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఏప్రిల్ 21న కేవలం సీతారామ్ భార్య, ఆమె ప్రియుడిని మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టు పది రోజుల ముందే జరిగినప్పటికీ పోలీసులు ఎందుకు రహస్యంగా ఉంచారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన తొమ్మిది మంది నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.