Kishan Reddy | సిటీబ్యూరో, ఏప్రిల్ 12 ( నమస్తే తెలంగాణ ): కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ ప్రజలకు చేసిన అభివృద్ధి లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో తెలియక కిషన్ రెడ్డి మోదీ జపం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే.. రెండు సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ.. కేంద్రమంత్రిగా బాధ్యతలు.. అంత గొప్ప శక్తి ఉన్న వ్యక్తి తనను గెలిపించిన ప్రజల కోసం ఎంతైనా చేయవచ్చు. కానీ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు ఎంత? చేసిన అభివృద్ధి పనులు ఎక్కడ? ఒక్కసారి చూపించండి అంటూ ఓటర్లు ప్రచారానికి వస్తున్న బీజేపీ నాయకులను నిలదీస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అంబర్పేటను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆ నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారు. కిషన్ రెడ్డి మోదీ జపం చేయడం తప్ప.. అతను చేసిన అభివృద్ధిపై మాట్లాడకుండానే ప్రచారం సాగిస్తున్నారని మండిపడుతున్నారు.
కిషన్ రెడ్డి సారధ్యంలో అంబర్పేట అభివృద్ధి తిరోగమనం చెందింది. 2004లో హిమాయత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఇదే నియోజకవర్గంలో అంబర్పేట ఉండేది. 2009, 2014లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన అంబర్పేట నియోజకవర్గం ప్రజల కోసం ఏ ఒక్కపని కూడా చేయలేదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిత్యం తాగునీటి ఇబ్బందులు, ముంపు సమస్యలు, సరైన రోడ్లు లేక సతమతమవుతున్న ప్రజలను ఆయన ఏనాడు పట్టించుకోలేదని ఓటర్లు పేర్కొంటున్నారు. ఇరుకు రోడ్లతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్తో ఇక్కట్లు, శ్మశాన వాటికలు లేక కష్టాలు పడుతున్న నియోజకవర్గం ప్రజల దుస్థితిని అర్థం చేసుకోలేదు. అంబర్పేట అంటే ఒక స్లమ్ ప్లాంతంగా దర్శనమిచ్చేది. వరదలొచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి ఆనాడు ఉండేది. ఎమ్మెల్యే నిధులను సైతం సరిగా వినియోగించలేదని ఆయనపై విమర్శలు ఉన్నాయి.
2004 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ కిషన్ రెడ్డి చెప్పుకోదగిన అభివృద్ధి చేయలేకపోయారని ఓటర్లు అంటున్నారు. 2018లో బీఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేశ్ గెలిచిన తర్వాత అంబర్పేట ముఖచిత్రం మారింది. సమస్యలకు నిలయంగా ఉన్న నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీసింది. రూ.441 కోట్ల అభివృద్ధి పనులు చేశారు. తాగు నీరు, ముంపు సమస్య పరిష్కారంతో పాటు అద్దంలా మెరిసేలా రోడ్లు, ఆహ్లాదకరమైన పార్కులు, ట్రాఫిక్ నివారణకు బిడ్జ్రిలు, బస్తీ దవాఖానలు ఇలా ఒక్కటేమిటీ సకల అభివృద్ధి పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి.
అన్ని వర్గాల అభివృద్ధిపై పద్మారావు దృష్టి సారించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.
* విద్యా రంగంలో చేయూతకు కృషి చేస్తూ.. రాష్ట్రంలో మొదటిసారిగా జూనియర్, డిగ్రీ కాలేజీ సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్లో మంజూరు చేయించారు. ఇందుకోసం రూ.29.75 కోట్ల నిధులను విడుదల చేయించారు. వీటిలో జూనియర్ కాలేజీకి రూ.6.30 కోట్లు, డిగ్రీ కాలేజీకి రూ.9 కోట్లు, హైస్కూల్కు రూ.14.45 కోట్లు మంజూరు చేయించారు.
* సికింద్రాబాద్ పరిధిలో 5 స్కూళ్లను ఎంపిక చేసి రూ.50 లక్షల చొప్పున నిధులను మంజూరు చేయించారు.
* నిరుద్యోగులకు స్కిల్స్ శిక్షణ ఇచ్చేందుకు సెట్విన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా 3,500 మందికి ఉపాధి కల్పించారు.
* మాతా శిశు సంక్షేమమే పరమావధిగా రూపొందించిన కేసీఆర్ కిట్ పథకం సికింద్రాబాద్ నియోజకవర్గంలో సంతృప్తికరంగా అమలైంది.
* తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను సీతాఫల్మండి, అంబర్నగర్, అడ్డగుట్టలో నెలకొల్పారు.
* సీతాఫల్మండి ప్రభుత్వ కుట్టి వెల్లోడి ఆసుపత్రి 75 పడకల స్థాయికి పెంచి కొత్త భవనాల నిర్మాణానికి రూ.9.25 కోట్ల నిధులను మంజూరు చేయించారు.
* రవీంద్రనగర్, చింతబావి, దుడ్బావి, ఇందిరానగర్, అంబర్నగర్ ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు.
* అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫల్మండి, బౌద్ధనగర్ డివిజన్లలో సుమారు రూ.21 కోట్ల నిధులతో వివిధ పనులను చేపట్టేల ప్రతిపాదనలు చేపట్టారు.
* శ్మశాన వాటికలు, పార్కులు, నర్సరీలు ఏర్పాటు చేశారు.
* రూ.441 కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.130 కోట్లతో 784 పనులు చేపట్టారు. అందులో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వీడీసీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
* రూ.56 కోట్లతో డ్రైనేజీ, పైపులైన్ పనులు చేశారు.
* ఎస్ఎన్డీపీలో భాగంగా రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.
* ముంపు సమస్య తలెత్తకుండా ఫీవర్ ఆసుపత్రి ఎదురుగా రిటర్నింగ్ వాల్ నిర్మించారు. మోహినీచెరువు, పటేల్ నగర్, ప్రేమ్నగర్, బాపునగర్ ప్రాంతాల్లో నాలా పనులు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వాటర్లాగింగ్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.
* రూ.100 కోట్లతో సీఆర్ఎంపీ రోడ్ల పనులు చేపట్టారు. అందులో భాగంగా ఓయూ నుంచి బర్కత్పుర-వైఎంసీఏ వరకు రోడ్లను సుందరీకరణ చేశారు.
* మహేశ్వర్ పరమేశ్వర్ థియేటర్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు, ఫీవర్ ఆసుపత్రి నుంచి తిలక్నగర్ వరకు, ఓయూ చౌరస్తా నుంచి చే నంబర్ వరకు, శ్రీరామ థియేటర్ నుంచి అలీ కేఫ్ మీదుగా డోల్నాక వరకు సీఆర్ఎంపీ రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
* అంబర్పేట ప్రజల ఆహ్లాదం కోసం అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో రూ.20 కోట్లతో థీమ్ పార్క్స్ ఏర్పాటు చేశారు.
* బర్కత్పుర హౌసింగ్ బోర్డు పార్కు జిమ్, షటిల్ కోర్ట్, ప్లే ఏరియా తదితర వసతులతో ఏర్పాటు చేశారు. దీంతో పాటు టీఆర్టీ పార్కు, సోమసుందర్ నగర్ పార్కులను ఏర్పాటు చేశారు.
* అంబర్పేట నుంచి నాగోల్కు షార్ట్ కట్ రూట్లో భాగంగా అలీకేఫ్ చౌరస్తా మీదుగా రూ.60 కోట్లతో 120 ఫీట్ల రోడ్డును అభివృద్ధి చేశారు.
* మిషన్ కాకతీయలో భాగంగా రూ.10 కోట్లతో మోహిని చెరువు సుందరీకరణ పూర్తి చేశారు.
* భారీ వర్షాలు కురిసే సమయంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఏర్పడే ముసారంబాగ్ నుంచి దిల్షుక్నగర్ వెళ్లే మార్గం మధ్యలో దేశంలోనే అత్యాధునికంగా బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆనాడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.52 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు.
* చాదర్ఘాట్ దగ్గర మరో బ్రిడ్జి నిర్మాణం రూ.42 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు.
* అంతేకాదు ముస్లిం సమాజం కోసం శ్మశాన వాటిక స్థలంలో భాగంగా కోట్ల రూపాయల విలువజేసే మూడు ఎకరాల స్థలాన్ని అప్పగించారు.
* హిందువుల కోసం రూ.3 కోట్లతో శ్మశాన వాటిక పనులు జరుగుతున్నాయి.
* రోడ్ల వెంట సుందరీకరణ కోసం రూ.40 లక్షలతో వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు.
* శివం రోడ్లో రూ.40 లక్షలతో ఏసీ బస్టాండ్ నిర్మించారు.
* నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఇబ్బందులు పడుతున్న వ్యాపారుల కోసం మార్కెట్ భవనం ఏర్పాటు చేశారు.
* రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణానికి ప్రాముఖ్యతను కల్పిస్తూ రూ.14 కోట్ల మేర నిధులను మంజూరు చేయించి 846 పనులను చేపట్టారు.
* మంచినీటి సరఫరా, సీవరేజీ ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
* రూ.వంద కోట్లకుపైగా నిధులతో రిజర్వాయర్ల పునిర్నిర్మాణం చేపట్టారు.
* సీతాఫల్మండిలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, బోయ బస్తీ, మధురనగర్ కాలనీలో ఫంక్షన్ హాల్లను నిర్మించి పేదలకు అధునాతన హంగులతో కల్యాణ వేదికలను అందించారు.
* అడ్డగుట్ట, లాలాపేటలో కొత్తగా మరో రెండు ఫంక్షన్ హాల్స్ నిర్మాణంలో ఉన్నాయి.
* తుకారం గేటు వద్ద రూ.73 కోట్లతో ఆర్యూబీ నిర్మించారు. దీంతో సికింద్రాబాద్లోని వివిధ ప్రాంతాలతో పాటు మల్కాజిగిరి, కంటోన్మెంట్ నియోజకవర్గాల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి.
* మెట్టుగూడలో రూ.30 కోట్లతో, మాణికేశ్వరినగర్లో రూ.20 కోట్లతో రెండు ఆర్యూబీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించారు.
* రూ.6.10కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రారంభించారు.