సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): అమెరికా నుంచి అక్కా, బావ వస్తున్నారని, వాళ్ల కోసం విమాన టికెట్లు బుక్ చేసేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు రూ.10.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీర్పేటకు చెందిన బాధితుడి అక్కా, బావ అమెరికాలో ఉన్నారు. వారు ఇండియాకు వచ్చేందుకు అవసరమైన ఆరు విమాన టికెట్ల కోసం బాధితుడు సోషల్ మీడియా గ్రూప్లో వచ్చిన ఓ నంబర్కు కాల్చేసి, ఆకాశ్ జాజు అనే వ్యక్తితో మాట్లాడి వివరాలు తీసుకున్నాడు.
ఆకాశ్ జాజు సూచన మేరకు విమాన టికెట్ల కోసం రూ.10.88 లక్షలు అతడి ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. బాధితుడు బుధవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.