హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ జాతీయ స్ఫూర్తితో నిండేలా, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బీఆర్కే భవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలపాటు తలపెట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహం కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. మంగళవారం 500 హాళ్లలో గాంధీ సినిమా ప్రదర్శితమైందని, దాదాపు 2.2 లక్షల మంది విద్యార్థులు చూశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 19, 541 పాఠశాలల్లోని 28.69 లక్షల మంది విద్యార్థులు గాంధీ సినిమా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ నెల 11న అన్ని చోట్లా ఫ్రీడం రన్ నిర్వహించాలని, పోలీసుశాఖ సహకారం తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 11 నుంచి 18 వరకు గ్రామ, మండల, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రా ల్లో ఫ్రీడం కప్ పేరిట స్పోర్ట్ మీట్లు నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ 12లోపు పూర్తి కావాలని ఆదేశించారు. 13న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యార్థులు, ఉద్యోగులతో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 16న పోలీస్శాఖ నేతృత్వంలో సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని ఆదేశించారు.
అన్నిశాఖల సమన్వయంతో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు రవిగుప్తా, సందీ ప్ సుల్తానియా, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శులు అరవింద్కుమార్, జయేశ్రంజన్, అడిషనల్ డీజీపీ జితేందర్, వివిధ ప్ర భుత్వ కార్యదర్శులు వాకాటి కరుణ, శేషాద్రి, జ్యోతిబుద్ధప్రసాద్, రిజ్వీ, హనుమంతరావు, అనిల్కుమార్, విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, డీఎంఈ రమేశ్రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, డైరెక్టర్ ప్రోటోకాల్ అర్వింద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.