కాప్రా, నవంబర్ 30: దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఈసీఐఎల్) సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా 2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను సిద్దిపేట జిల్లాలోని రెండు ప్రభుత్వ హాస్పిటళ్లకు గర్భిణులకు సుఖవంతమైన ప్రసవం కోసం ఉపయోగపడే రూ.9.48లక్షల విలువైన ఆరు ‘వాక్యూమ్ అసిస్టెడ్ డెలివరీ సిస్టమ్స్'(వీఏడీఎస్)ను అందజేసింది. బుధవారం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు నాలుగు, గజ్వేల్లోని ప్రభుత్వ హాస్పిటల్కు రెండు వీఏడీఎస్లను ఈసీఐఎల్ ప్రతినిధులు అందజేశారు. ఈ హాస్పిటళ్ల పరిధిలో ప్రతి ఏటా ప్రసవం పొందే 3,600 మంది గర్భిణులకు ఈ వీఏడీఎస్లు ఎంతగానో ఉపయోగ పడుతాయని పేర్కొంటూ హాస్పిటళ్ల పాలనాధికారులు, వైద్యులు ఈసీఐఎల్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.వేణుబాబు, పర్సనల్ ఆఫీసర్ సునిల్కుమార్, ఈసీఐఎల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరుణానిధి, ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేశ్, తదితరులు పాల్గొన్నారు.