Godavari Express | సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)/మరేడ్పల్లి/ఘట్కేసర్ : విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం 6.10 గంటలకు బీబీనగర్- ఘట్కేసర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి. మిగిలిన 16 బోగీలకు ఎలాంటి నష్టం జరగలేదు. రైలులో ప్రయాణిస్తున్న దాదాపు 1500 మంది క్షేమంగా ఉన్నారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సమాచారం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాడైపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా బుధవారం అర్ధరాత్రి వరకు పూర్తిచేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్లే రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు. రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ దగ్గర ఉండి పునరుద్ధరణ పనులు చేయించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు.
గోదావరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో.. వెంటనే ఆ మార్గంలో వెళ్లే తొమ్మిది రైళ్లను రద్దు చేశారు. మరో 19 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడు రైళ్ల సమయాలను మార్పులు చేయడంతో పాటు ఆరు రైళ్లను మాత్రం దారి మళ్లించి.. ఇతర మార్గాల ద్వారా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దు చేసిన రైళ్లలో ప్రయాణికుల సౌకర్యం సికింద్రాబాద్, నల్లగొండ స్టేషన్లలో ప్రత్యేక టికెట్ రీఫండ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన కారణాలు తెలుసుకోవడం కోసం త్వరలోనే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీఆర్ సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. కమిటీ నివేదిక అనంతరం, రైల్వే ట్రాకుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో ఆ మార్గంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు.