పీర్జాదిగూడ, జనవరి 17: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సోమవారం పీర్జాదిగూడ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ , మేయర్ వ్యాక్సినేషన్ పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులను వ్యాక్సిన్, కరోనా పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు.ఫ్రంట్లైన్ వారియర్స్తో పాటు వృద్ధులు కూడా బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు.
ట్యాంకు నిర్మాణం కోసం స్థల పరిశీలన..
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు ప్రతి రోజు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్ కింద మంజూరైన 50 లక్షల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు నిర్మాణం కోసం అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, మేయర్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు, తాసీల్దార్ మహిపాల్రెడ్డి, డిప్యూటీ మేయర్, అధికారులు రమ్యకృష్ణ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి : ఎంపీపీ
ఘట్కేసర్ రూరల్ : కరోనా మహమ్మారిని నివారించాలంటే ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్లోని వ్యాక్సినేషన్ సెంటర్ను ఎంపీపీ సోమవారం పరిశీలించారు. గ్రామంలో ఎంత మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా తీసుకోవలసిన వారు ఎవరైనా ఉన్నారా ? అనే విషయమై ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.రెండు డోసులు వేసుకున్నవారు బూస్టర్ డోస్ వేసుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు.