హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఓ బాబా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్దరు యువతులు.. పాతబస్తీలోని ఓ బాబాను ఆశ్రయించారు. తల్లికి వైద్యం చేస్తూనే.. ఆమె కుమార్తెలపై బాబా కన్నేశాడు. కామంతో రగిలిపోయాడు. అక్కాచెల్లెళ్లపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వీరిలో ఒకరికి పెళ్లి కాగా, ఆమెకు విడాకులు కూడా ఇప్పించి దారుణాలకు పాల్పడ్డాడు. ఆ వివాహితపై బాబా కుమారుడు కూడా అత్యాచారం చేశాడు. అక్కాచెల్లెళ్లను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, ఆర్థికంగా కూడా కుంగదీశాడు బాబా. బాధిత యువతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాబాతో పాటు అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.