బల్దియాకు గతంలో వీధి దీపాల నిర్వహణకు పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చయ్యేది. కరెంటు బిల్లులు సైతం అధికంగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఎల్ఈడీ దీపాల బిగింపుతో ఆ భారం గణనీయంగా తగ్గింది. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 5.26 లక్షల ఎల్ఈడీ లైట్లను బిగించగా, జీహెచ్ఎంసీ ఖజానాకు రూ. 570 కోట్లు ఆదా అయ్యాయి.
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న మార్గాలు ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులు వచ్చేలా నగరంలో ఎల్ఈడీ దీపాలను అమర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 5.26 లక్షల ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయగా…తద్వారా రూ. 570 కోట్ల మేర ఆదా చేసుకున్నది. కాగా గతంలో వీధి దీపాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సమస్యగా ఉండేది. వీధి దీపాలకు పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చవ్వడమే కాకుండా విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చేవి. వీధి దీపాలు వేసేందుకు, ఆపేందుకు ప్రత్యేకంగా మనుషులు అవసరమయ్యే వారు.
వారికి వేతనాలకు కూడా బోలెడంత ఖర్చయ్యేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో 5లక్షల 26,136 ఎల్ఈడీ దీపాలను అమర్చారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న వనరులను ప్రోత్సహించడం, మెరుగైన వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, పబ్లిక్ రంగ సంస్థ (ఎన్టీపీసీ) జాయింట్ వెంచర్తో పనిచేస్తుందని చెప్పారు. వీధి దీపాల నిర్వహణ సమర్థవంతంగా కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు.