Potti Sreeramulu Telugu University – PSTU | నా ఒడి – కుంచెకు రంగులద్ది ప్రపంచ క్యాన్వాస్కు పరిచయం చేస్తుంది. నా బడి – మువ్వకు నాట్యం నేర్పి విశ్వవేదిక మీద ప్రదర్శనలిస్తుంది. నా మడి – నటనకు భాష్యం చెప్పి రంగస్థల, వెండితెర ‘వేల్పుల్ని’ తయారుచేస్తుంది. నా గడి – రాయిని శిల్పంగా చెక్కి ఎందరినో సుశిక్షిత స్థపతులుగా మలుస్తుంది. నా గుడి – స్వరానికి సౌరభాల్ని దిద్ది సంగీత సమ్రాట్టులుగా కరచాలనం చేయిస్తుంది..
.. నాలో లలిత కళలు పురివిప్పి పరవశిస్తాయి. నా దగ్గర కళాత్మకత కొత్త చిగుళ్లు తొడుగుతుంది. నా నీడలో సాహిత్యం నవోత్సాహాన్నిస్తుంది. ఇక్కడి రాయి జ్యోతిషం చెబుతుంది, ఇక్కడి మొక్క భాషా వైభవాన్ని చాటుతుంటుంది. నాలోని ఇసుక రేణువు వార్తా రచనకు శ్రీకారం చుడితే.. నావద్దనున్న జేగంట జానపదానికి వంత పాడుతుంది. ఇక్కడి గడ్డిపోచలు కలాలై కవాతులు చేస్తాయి. ఇక్కడి నీటి బిందువు ఇంద్రధనుస్సులను నేలపై చూపుతుంది. సకల కళల ప్రాంగణంగా, సర్వ సంస్కృతుల ఆలయంగా నవ సృజనలకు నిలయంగా కొత్త ఊహలకు ఆవాసంగా నేను దాదాపు నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నాను.
అవును. నేను.. మీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని.
ఇప్పుడెందుకు నా గతాన్ని తల్చుకోవాల్సి వస్తున్నదని అనుకుంటున్నారా? ఎన్నో గొప్ప కార్యక్రమాలు నా సమక్షంలో జరిగాయన్నది ఒక వాస్తవమైతే, నేనిప్పుడు మరింత విశ్వజనీనం కాబోతున్నానన్నది మరో నిజం. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచీ జ్ఞానతృష్ణతో వచ్చే నా బిడ్డలు.. వస్తూ వస్తూ ఆశల గంపలను వెంట తెచ్చుకుంటారు. కాబట్టే, పెరుగుతున్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కోర్సులను పెంచుకుంటూ పోతున్నాను. నా పాత ఆవరణ నా ఆకాంక్షలంత సువిశాలం కాదు. అప్పట్లో, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ పక్కనే.. మూడెకరాల స్థలంలోనే నన్ను తీర్చిదిద్దారు. ఆనాటి వెండితెర వేల్పు, రాజనీతి కోవిదులు నందమూరి తారక రామారావు నన్ను ప్రతిష్ఠిస్తే.. తెలుగు భాషను తలమీద బోనంగా ఎత్తుకునే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సువిశాలమైన 100 ఎకరాల స్థలంలో కళారామంగా, భాషానిలయంగా, ఉపాధి కల్పనాలయంగా నన్ను ఆవిష్కరించనున్నారు. నిజానికి ఏ విశ్వవిద్యాలయ ధ్యేయమైనా బోధన, ప్రచురణ, విస్తరణలే. నా ద్వారా తెలుగు భాషను, తద్వారా సాహిత్యాన్ని, భారతీయ సంస్కృతిని పరిరక్షించాలన్నది వ్యవస్థాపకుల ఆశయం. అన్నట్టు, త్వరలోనే నేను ‘బాచుపల్లి’లో మహా సుందరంగా, సర్వహంగులతో, సకల కళారామంగా తీర్చిదిద్దిన ఆవరణలో పాదం మోపుతున్నాను.
* * *
నా కథ ఇప్పటిదా? 1983లో అధికారం చేపట్టిన ఎన్టీఆర్.. సాహిత్య, సంగీత, నృత్య, నాటక, లలిత కళా అకాడమీల పట్ల ఎంతో ఆసక్తి చూపారు. సుప్రసిద్ధ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేసి.. ఆ నివేదిక ఆధారంగా విజ్ఞాన పీఠాన్ని నెలకొల్పారు. కానీ, తెలుగు భాషను, సాహిత్యాన్ని, కళల్ని మరింత విస్తృతపరిచే సదాశయంతో మరోసారి జస్టిస్ ఆవుల సాంబశివరావు అధ్యక్షులుగా ఐదుగురు విద్యావేత్తలతో ఓ కమిటీని ప్రకటించారు. ఆ నిపుణుల బృందం సూచనలను నా ద్వారా అమలు చేయించాలని తీర్మానించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ, విజ్ఞాన సర్వస్వ కేంద్రం, కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రాలనూ నాకే అనుబంధం చేశారు. రాజమండ్రిలో సాహిత్య పీఠాన్ని, హైదరాబాద్లో భాషాభివృద్ధి పీఠాన్ని, లలిత కళాపీఠాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీశైలంలో చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్ర పీఠాన్ని స్థాపించారు. వరంగల్లులో జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని, హైదరాబాద్లోని నా ఆవరణలోనే సామాజిక శాస్త్రాల పీఠాల్నీ ప్రారంభించారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారు. గతంలోని విజ్ఞాన సర్వస్వ కేంద్రం రద్దయ్యింది కాబట్టి.. ఆ స్థానంలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ కేంద్రం, తులనాత్మక అధ్యయన కేంద్రం వెలిశాయి. కూచిపూడి పూర్వపు సిద్ధేంద్ర కళాకేంద్రం స్థానంలోనే సిద్ధేంద్ర యోగి కళాపీఠం అవతరించింది. నిఘంటు నిర్మాణం ద్వారా భాషను పరిపుష్టం చేస్తూ.. భాషా శాస్త్రం ద్వారా తెలుగు భాష సౌందర్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ.. సాహిత్యం, తులనాత్మక అధ్యయనం, భాషల అనువాద అధ్యయనాలు, బోధనల ద్వారా తెలుగు వెలుగులను పంచుతూ.. సంస్కృతి-చరిత్రలను చాటిచెబుతూ పిల్లలకు మన మూలాలు ఎరుకపరుస్తూ.. పర్యాటక, కమ్యూనికేషన్, జర్నలిజం కోర్సుల ద్వారా ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తూ.. జ్యోతిషం, వాస్తు ద్వారా వికాసం పెంపొందిస్తూ.. మిమిక్రీ, ఫిల్మ్ డైరెక్షన్, డిజైన్, లైబ్రరీ సైన్స్, యోగా ద్వారా వినూత్న అంశాలపట్ల అవగాహన కల్పిస్తూ.. ఈ నేలకు నా వంతు సేవచేస్తున్నా. వివిధ సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ కోర్సులను రెగ్యులర్గా, సాయంకాలం కోర్సులుగా అందిస్తూ చదువుల సారాన్ని చేరువ చేస్తున్నాను. తూమాటి దోణప్ప మొదలు డా. సి.నారాయణరెడ్డి, ఆచార్య పేర్వారం జగన్నాథం, ఆచార్య నాయిని కృష్ణకుమారి, ఆచార్య ఎన్.గోపి, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, ఆచార్య ఆవుల మంజులత, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ, ఇప్పటి నా మరోబిడ్డ ఆచార్య తంగెడ కిషన్రావు వరకు అందరి పాలన ప్రత్యక్షంగా చూసినదాన్ని నేను. బతుకమ్మలోని ఒక్కొక్క పువ్వుకూ ఒక్కో విశేషం ఉన్నట్లుగా నాలోని ప్రతీ విభాగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందుకే ఒక్కొక్క పువ్వుతో ఒక్కో విభాగాన్ని పోల్చుకుంటూ వెళ్లిపోదాం..
ఇది ఆడియో వీడియో విభాగం. ఎనిమిది తొమ్మిదేండ్ల క్రితం విద్యార్థుల కళాపాటవాల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికే ఏర్పాటైంది. కానీ, ఈ సంవత్సరం గతంలో జరగనన్ని రికార్డింగ్స్ చేశాం. జాతీయ, అంతర్జాతీయ తెలుగు వేల్పుల్ని పిలిపించి వారివారి వృత్తిగత, వ్యక్తిగత, సామాజిక విశేషాలను సమాజానికి పరిచయం చేయించాం. అంతేకాదు, 32 మంది షష్టిపూర్తి కలాలుగా చిరపరిచితులైన రచయిత్రుల్ని పిలిపించి ‘మాతృవందనం’ చేస్తూ గొప్ప సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాం. వారి జీవన ప్రస్థానాల్ని పదిలపరిచాం.
ఈ కేంద్రం 1975లోనే ఏర్పాటైనా, మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానం ద్వారా.. నా పుట్టుక సమయంలో, అంటే 1985లో నాలో అంతర్భాగమైంది. ఖండాంతర, రాష్ర్టేతర తెలుగువారిని దృష్టిలో పెట్టుకుని ఈ వేదిక ఆవిర్భవించింది. ప్రపంచ తెలుగు భాషాభిమానులకు భారతీయ సంస్కృతి విలువల్ని తెలియజేస్తూ, ప్రపంచంలోని తెలుగు వారందరినీ ఒక తాటిమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నదీ విభాగం. విదేశాల్లోని 50 తెలుగు సంఘాలు, ఇతర రాష్ట్రాలలోని 300 తెలుగు సంఘాలనూ ఒక తాటిమీదికి తెచ్చి.. తెలుగు భాషను మరింత వ్యాప్తి చేయడమే ఈ విభాగం లక్ష్యం. తరచూ ఆయా ప్రాంతాలకు వెళ్లి, మేమే సభలు నిర్వహిస్తాం. వారిని ఇక్కడికి రప్పించి ప్రత్యేక సమావేశాలూ ఏర్పాటుచేస్తాం. తద్వారా ఒక అనుసంధానం ఒనగూరుతుంది. బంతిపూవు ఎంత అందంగా ఉంటుందో అంత ఆకర్షణీయమైన సేవల్ని ఈ విభాగం అందిస్తుంది.
మనిషికి గుండెకాయ లాంటిది.. నాకు ఈ విస్తరణ సేవా విభాగం. ప్రతిభ కలిగిన సాహితీ శిఖరాల్ని గుర్తించడమే కాదు.. వారిని సముచిత రీతితో సత్కరిస్తాను. దీనివల్ల ఎంతోమందికి స్ఫూర్తి కలుగుతుంది. కీర్తి, ప్రతిభ పురస్కారాలే కాకుండా.. విశిష్ట పురస్కారాలను కూడా ప్రదానం చేస్తూ, సాంస్కృతిక రంగ వికాసం కోసం అవిరళ కృషి చేస్తున్నా. అంతేకాదు, చక్కటి గ్రంథ రచనలకు ఆర్థిక సహాయం అందిస్తాను. నిష్ణాతులైన సాహితీ మూర్తుల గురించి స్మారకోపన్యాసాలను నిర్వహిస్తాను. విశ్వవిద్యాలయ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏదైనా ఓ రంగంలోని లబ్ధ ప్రతిష్ఠుడికి లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని అందిస్తాను. చిత్రలేఖనం, శిల్పకళా రంగాల్లో ఉన్నత విద్యకోసం వెళ్లేవారికి ఉపకార వేతనాలను మంజూరు చేస్తాను. ప్రదర్శనల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే కళాకారులకు రైల్వేశాఖ ద్వారా ప్రత్యేక రాయితీలు ఇప్పించడమూ నా బాధ్యతే.
తంగేడు పూవు గుత్తులు గుత్తులుగా పూసి చూపరులను ఆకర్షించినట్టు.. సమకాలీన ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలే కాకుండా, తరాలనాటి కళారూపాలకూ వేదికగా నిలుస్తున్నది నా మ్యూజియం. ప్రతినిత్యం ఎందరో కళా ప్రేమికులు ఇక్కడికి వస్తారు. హైదరాబాద్లోని ప్రధాన విద్యాలయంతో పాటు వరంగల్లోని గిరిజన విజ్ఞాన కళాకేంద్రం, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో ఉన్న కళాప్రాంగణాల ద్వారా తెలుగు సాహిత్యాన్ని బోధించడం నాకిష్టం. బాలికల సంఖ్య పెరగడంతో.. తొలిసారిగా విద్యార్థినుల వసతిగృహాన్ని కూడా ఏర్పాటు చేయించాను. డిజైనింగ్ కోర్సులలో ఉపాధి అవకాశాలను గుర్తించి 19 కొత్త కోర్సులను పరిచయం చేశాను. త్వరలోనే, బాచుపల్లి కేంద్రానికి ఈ నాంపల్లి భవన సముదాయం ఉపకేంద్రంగా ఉంటుంది. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటుంది.
గన్నేరు పూలు చెట్టునిండా కొలువై ఇట్టే ఆకర్షిస్తాయి. మన బడి కార్యక్రమం కూడా అలాంటిదే. విదేశాల్లో స్థిరపడిన తెలుగు పిల్లలు భాషా సంస్కృతులకు దూరం కాకుండా ఈ విభాగం వంతెనలా వ్యవహరిస్తుంది. మన బడిని అమెరికాలో ఏర్పాటు చేసుకున్నా.. నా ఆధ్వర్యంలో నృత్యం, సంగీతం, భాషకు సంబంధించిన సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తాను. ప్రతి సంవత్సరం పరీక్షలు జరిపించి, ఫలితాలను ప్రకటిస్తాను. ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్లను ప్రదానం చేయడం ద్వారా.. తెలుగు నేలకు నా పిల్లలు దూరం కాలేదన్న భావనను పెంచుతుంటాను. కొత్తతరానికి అందని భాష.. అంతరించిపోయే ప్రమాదం ఉంది.
రచన వేలితో చేయొచ్చు కానీ ప్రచురణ వేలతో జరిగే పని. అక్షరాన్ని ప్రేమించడమంటే అక్షరాన్ని వ్యాపింప చేయడమే. అదే ఆ రచనకు పరమావధి. ప్రాచీన, నవీన గ్రంథాలతోపాటు సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తమిళ భాషలలోకి మన తెలుగు పుస్తకాలను అనువాదం చేయించడమూ నా పనే. విశ్వసాహితి, భారత భారతి, తెలుగు సాహిత్య విమర్శ లాంటి గొప్ప పుస్తకాలు నా ప్రచురణల విభాగం చొరవతో వెలుగులోకి వచ్చాయి. తెలుగువారి చరిత్ర మీద ఎనిమిది ఉపయుక్త గ్రంథాలు తెచ్చాను. సీతమ్మ జడబంతి ఎక్కడ వేసినా ఇంతింతై అన్నట్టు పెరిగిపోయి, దోసిళ్ల కొద్దీ పూలు ఇచ్చినట్టు మావిభాగంలో అక్షర పుష్పాలు పూస్తాయి.
ఇంకో విషయం! కళాకారులు పెరిగేకొద్దీ సమాజంలో ప్రశాంతత, ఆనందం తాండవిస్తాయి. ఆనంద సూచిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలనే చూడండి. అక్కడ కళాకారులకు అపారమైన ఆదరణ ఉంటుంది. కళాకారులు సున్నిత మనస్కులు. హింసించలేరు. హింసను ప్రోత్సహించలేరు. ఇక భాష అంటారా? మాతృభాష తెలుగును అమృత భాషగా బతికించుకోవడమే మనందరి బాధ్యత. మన పాల భాషను, పాలబువ్వ భాషను.. పరిపాలనా భాషగా చేయడానికి మనవంతు కృషి చేయాలి.! అందుకు కంకణబద్ధులం కావాలి.మీ అందరి వికాసమే నా వినోదం. మీ అందరి ప్రగతే నా పురోగతి. కళ్లలో ప్రేమ, స్పర్శలో క్షమ, గుండెల్లో తేమ.. అమ్మతనపు స్వభావం. సర్వదా నేను మీ బాగోగుల్ని ఆకాంక్షిస్తూనే ఉంటాను.
ఇట్లు.. మీ అమ్మ.. భాషాసాహిత్యాల పట్టుగొమ్మ..
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
-✍ అయినంపూడి శ్రీలక్ష్మీ, 9989928562
నలభైల్లోపే రిటైర్ అవ్వండి.. ఇలా జీవితంలో కొత్త ఆనందాన్ని వెతుక్కోండి