సూర్యాపేట టౌన్/ హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 3: తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ చేసిందేమీ లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు రాజకీయంగా దిగజారుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడంలో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచిందన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళి అర్పించారు.
కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, కాసోజు శ్రీకాంతాచారి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మమాతృ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో శ్రీకాంతాచారి 13వ వర్ధంతి నిర్వహించారు. మధుసూదనాచారి పాల్గొని శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమాన్ని తన బలిదానంతో ఉధృతం చేసిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి అని కొనియాడారు. ఆయన త్యాగం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతిని ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.