Hussain Sagar | ఆధ్యాత్మిక పారవశ్యంలో నగరం ఓలలాడింది. గల్లీ నుంచి ట్యాంక్బండ్ వరకు ఎటుచూసినా భక్తజనమే. ఊరేగింపు కొనసాగిన రహదారి మొత్తం పండుగ కళతో శోభిల్లింది. గణపతుల వెంట సాగిన యువతీ, యువకులు, గులాల్ చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. జయజయధ్వానాలతో పరిసరాలను మార్మోగించారు. ఎక్కువ ఎత్తున్న విగ్రహాలతో వచ్చిన శకటాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అందరి చూపు ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనోత్సవంపైనే. ఆ బృహత్తర ప్రక్రియను వీక్షించడానికి గురువారం భక్తులు పోటీపడ్డారు. ఆ గణనాథులను తమ సెల్ఫోన్లో క్లిక్మనిపించారు. వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. శోభాయాత్ర పొడవునా జైజై గణేశా.. బైబై గణేశా.. గణపతి బప్పా మోరియా అంటూ స్మరించారు. భక్తులకు మార్గం పొడవును స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంఘాలు ఆహార పదార్థాలు, తాగునీరు అందించారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ)
నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్బండ్కు విచ్చేశారు. ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు. డ్యాన్సింగ్ గణేశా, మ్యూజికల్ గణేశ, బుల్లెట్ గణేశా, చిట్టి బాహుబలి గణేశా, సిక్స్ప్యాక్ గణేశా తదితర విభిన్న రూపాల్లో లంబోదరుడు కనువిందు చేశాడు. కొందరు వాహనాలపై తీసుకొస్తే మరి కొందరూ పల్లకీలో తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. సాయంత్రం అయ్యేకొద్ది అత్యధిక విగ్రహాలు ట్యాంక్బండ్కు తరలివచ్చాయి. యువతులు, యువకులు తీన్మార్ స్టెప్పులతో ధూంధాం చేశారు. డ్రెస్ కోడ్తో అలరించారు.
విశాల రహదారులు ఈసారి ట్యాంక్బండ్ పరిసరాల రూపురేఖలు మారిపోవడం గణనాథుల శోభాయాత్రకు కలిసొచ్చింది. గతంలో ట్యాంక్ బండ్ పరిసరాలు ఇరుకుగా ఉండటంతో ఊరేగింపులో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ సారి విశాలమైన రహదారులతో జనం ఎంతొచ్చినాఫ్రీగా మూవ్మెంట్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ పరిసరాలు ఈ కార్ రేసింగ్ పోటీలతో దారులు వెడల్పు చేశారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహం వద్ద విశాలమైన స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇక అమరవీరుల స్మారకం, లుంబినీ పార్క్, సచివాలయ పరిసరాల్లో చాలా వరకు ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. దీంతో భక్తులు స్వేచ్ఛగా కలియతిరిగారు.
నిమజన్జనోత్సం సందర్భంగా చిరుతిళ్లవ్యాపారులు, టాటూ, బొమ్మల దుకాణాలు, ఐస్క్రీం సందడి తలపించాయి. ప్రతీ రోజుకు భిన్నంగా గురువారం సందర్శకులు భారీ స్థాయిలో కొనుగోలు చేశారు. దీంతో వారి వ్యాపారం త్రిబుల్ అయిందంటూ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.
హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి చాలా వరకు మట్టి విగ్రహాలే దర్శనమిచ్చాయి. వినాయక చవితి నెలరోజుల ముందునుంచే మట్టి విగ్రహాల ఏర్పాటుపై స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఫలితంగా పలు మండపాలు, నివాసాలు, గేటెడ్ కమ్యూనిటీలు మట్టితో తయారు చేసిన విగ్రహాలకు ప్రాధాన్యతనిచ్చాయి.