కీసర, ఫిబ్రవరి 26 : స్వయంభూ కొలువై, రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 4వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు ఆలయ కమిటీ సకల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. భక్తులకు స్వామి దర్శనం త్వరగా కల్పించడంతోపాటు మౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. విఘ్నేశ్వరపూజతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కానుండగా, వచ్చేనెల 4వ తేదీన పరిసమాప్తం కానున్నాయి. కీసరగుట్టకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఆధ్వర్యంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇప్పటికే మూడుసార్లు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. త్వరగా దర్శనమయ్యేలా క్యూలైన్లు,బారికేడ్లు ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, ఈవో కట్టా సుధాకర్రెడ్డి తెలిపారు.
ఇబ్బందులు రానీయం:మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్ హరీశ్
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో శనివారం కలెక్టర్ వివిధ జిల్లా శాఖల అధికారులతో కలిసి కీసరగుట్టలో పర్యటించారు. క్యూలైన్లు, పార్కింగ్, స్పోర్ట్స్ గ్రౌండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాలు, పార్కింగ్ ప్రాంతంలో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాన్ని విద్యుత్దీపాలతో అలంకరించి, ఎల్ఈడీ లైట్లు బిగించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర చికిత్స కోసం వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని, అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్లు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్, కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, ఈవో కట్టా సుధాకర్రెడ్డి, డీపీవో రమణమూర్తి, ఆర్డీవో రవి, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్శాఖలతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
200 ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి పురస్కరించుకొని కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సికింద్రాబాద్ డీవీఎం జగన్ తెలిపారు. కీసరగుట్ట ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం బ్రహ్మోత్సవాల కరపత్రం,వాల్పోస్టర్ ఆవిష్కరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 ఆర్టీసీ బస్సులను నడుపుతామని..కుషాయిగూడ, చెంగిచర్ల, హకీంపేట, ఉప్పల్, రాణిగంజ్ 1,2 డిపోలు, కంటోన్మెంట్, మేడ్చల్ డిపోల నుంచి బస్సులు నడుస్తాయన్నారు.
బ్రహ్మోత్సవాల వివరాలు
27వ తేదీ ఆదివారం: విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనము, రుత్విక్ వరణము, పంచగవ్యస్థాపన, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతిష్టాపనం, సాయంత్రం 4 గం.లకు అగ్నిప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, నీరాజన, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం,తీర్థప్రసాద వినియోగం, రాత్రి 8 గం.లకు స్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేయడం. 28వ తేదీ సోమవారం: ఉదయం 9 గంటల నుంచి రుద్రస్వాహాకర హోమం, బిల్వార్చన, రాత్రి 7 గంటలకు ప్రదోషకాల పూజ, నీరాజన, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం, రాత్రి 8 గంటలకు స్వామివారు కీసర నుంచి కీసరగుట్టకు విచ్చేయుట, రాత్రి 9.30గంటలకు ధనష్ట నక్షత్రయుక్త మకరలగ్నమందు శ్రీ భవాని శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం. మార్చి 1, మంగళవారం: ఉదయం 4గంటల నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 6 గంటల నుంచి సామూహిక అభిషేకములు (కల్యాణమంటపంలో) ఉదయం 9 గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, రాత్రి 8 గంటల నుంచి నందివాహన సేవ, రాత్రి 10గంటలకు భజనలు, రాత్రి 12 గంటల నుంచి శ్రీ రామలింగేశ్వరస్వామి వారికి సంతతధారాభిషేకం (లింగోద్భవకాలంలో).
మార్చి 2, బుధవారం: ఉదయం 5.30గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 6 గంటల నుంచి సామూహిక అభిషేకాలు, ఉదయం 8 గంటల నుంచి స్వామి వారికి తైలాభిషేకం, అన్నాభిషేకం(అన్నపూజ). రాత్రి 9 గం.లకు రుద్రస్వాహకార హోమం, రాత్రి 9.30గంటలకు ప్రదోషకాలపూజ, నీరాజన, మంత్రపుష్పము, అనంతరం విమాన రథోత్సవం.
మార్చి 3, గురువారం: దయం 5.30 నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, రాత్రి 7 గంటల నుంచి ప్రదోషకాల పూజ, నీరాజన, మంత్రపుష్పం, రాత్రి 8గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం.
మార్చి 4, శుక్రవారం: ఉదయం 5.30గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, 11 గంటలకు పూర్ణాహుతి, నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, ఉత్సవసమాప్తి పండిత సన్మానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
విద్యార్థులు,యువతకు క్రీడాపోటీలు
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, యువతకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన,క్రీడలశాఖ అధికారి బలరామారావు తెలిపారు. ఈనెల 27,28 తేదీల్లో పాఠశాల విద్యార్థులకు, మార్చి 2,3 తేదీల్లో యువతకు కబడ్డీ, ఖోఖో,వాలీబాల్, చెస్, టెన్సిస్, బ్మాడ్మింటన్ పోటీలు, మార్చి 4న ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు ఆటలపోటీలు ఉంటాయన్నారు.
ఏడుపాయల, బీరంగూడకు..
మార్చి 1న మహాశివరాత్రి సందర్భంగా నేటి నుంచి మార్చి 4 వరకు కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈసీఐఎల్ ఎక్స్రోడ్, తార్నాక, రెజిమెంటల్బజార్, ఉప్పల్ ఎక్స్రోడ్, ఘట్కేసర్, వెంకటాపురం, అల్వాల్, అమ్ముగూడ, బాలానగర్ ఎక్స్రోడ్, మియాపూర్ ఎక్స్రోడ్డు, పటాన్చెరు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సులను 30 మంది గ్రూపుగా కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఇతర వివరాల కోసం 9959226142, 9959226144, 9959226145, 9959226149, 9959226154 నంబర్లను సంప్రదించొచ్చు.