సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : చేతిలో రెండేళ్ల చిన్న పిల్లాడు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఉన్నామనే సోయి లేదు. కానీ నవమాసాలు మోసిన ఆ చిన్న పిల్లాడితో మానసిక రోగి అయినా ఆ తల్లి చత్తీస్ఘడ్లోని బిలాస్పూర్కు చేరుకున్నది. ఆమె మానసిక పరిస్థితిని గమనించిన ఘరీయాబాద్లోని సఖీ కేంద్రం ప్రతినిధులు తల్లి, బిడ్డను అక్కడి స్టేట్ హోంలో సంరక్షించారు. అయితే ఆమె తెలుగు మాట్లాడుతుందని గ్రహించి అక్కడి అధికారులు.. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆథారిటీకి సమాచారం అందించారు.
జస్టిస్ పి.శాంకోషే ఆదేశాలతో ఆథారిటీ సభ్యులు గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్, మహిళా కానిస్టేబుల్ స్వాతి, వెన్నెలాదేవి బృందం చత్తీస్ఘడ్ చేరుకుని, హర్షిత(హరిత రాజా)ను అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. హర్షిత మానసిక స్థితిని పరిశీలించిన అధికారులు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మెరుగైన వైద్యం కోసం చేర్చారు. రెండేళ్ల పిల్లాడిని అమీర్పేట్లోని ఎట్ హోంకు తరలించినట్లుగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. అయితే ఆచూకీ తెలిసిన వారు హైకోర్టు ప్రధాన కార్యాలయంలోని లీగల్ సర్వీసెస్ కార్యాలయాన్ని గానీ, లేదా 040-23446723 ద్వారా సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.