మియాపూర్, జనవరి 6 : శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గం తాజా ఓటరు జాబితా సవరణ సందర్భంగానూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 6,44, 072 మంది ఓటర్లు నిర్ధారణ అయ్యారు. ఇందులో పురుషులు 3,42,651 కాగా 3,01,285 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 136 మంది ఇతరులున్నారు. కాగా ఈ ఓటర్ల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికం. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి సంఖ్యాపరంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం తొలి స్థానంలోనే నిలుస్తున్నది.
మూడు జిల్లాలు..11 డివిజన్లు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం భారీగా విస్తరించి ఉన్నది. 15 లక్షలకు పైచిలుకు జనాభా ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నది. ఓటర్ల పరంగా 6.44 లక్షల పై చిలుకు తాజా ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం తేలింది. అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నది. మొత్తం 11 డివిజన్లు నియోజకవర్గ పరిధిలో ఉండగా.. అందులో 7 డివిజన్లు రంగారెడ్డి, మూడున్నర డివిజన్లు మేడ్చల్, మరో డివిజన్ సంగారెడ్డి జిల్లా పాలనా పరిధిలోకి వస్తున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి పార్ట్, వివేకానందనగర్, హైదర్నగర్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, చందానగర్, హఫీజ్పేట్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, ఆర్సీపూర్ డివిజన్లున్నాయి. వీటిలో మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్లలో ఐటీ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
బాధ్యతాయుతంగా ముందుకు సాగుతాం..
రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉండటం ప్రజలకు సేవలందిస్తుండటం ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది. 16 లక్షలకు పైగా జనాభా.. 6.44 లక్షలకు పైగా ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు. రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం కావటం వల్ల ఎప్పటికప్పుడు ప్రజావసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా పనులతో ముందుకు సాగుతున్నాం. ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటును ఎన్నటికీ మరువం.
– అరెకపూడి గాంధీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శేరిలింగంపల్లి నియోజకవర్గం