సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈవ్ టీజర్లు వేధింపులకు పాల్పడుతున్నారా..? మీకు అండగా షీ టీమ్స్ ఉన్నాయి.. వేధింపులపై మౌనం వీడండి.. ఆపద వచ్చిందని మీలో మీరు కుమిలిపోకండి.. షీ టీమ్స్కు సమాచారం ఇవ్వండి.. మిమ్మల్ని వేధిస్తున్న వారి నుంచి రక్షణ కల్పిస్తుంది. నేరగాళ్లను కటకటాల్లోకి పంపిస్తుంది. 2022లో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో 400 ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. వచ్చిన చాలా ఫిర్యాదుల్లో పెట్టీ కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ ఇచ్చి ఈవ్ టీజర్ల మైండ్సెట్ మార్చేందుకు అవగాహన కల్పించారు. మరింతగా వేధింపులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపించారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ షీ టీమ్స్ అత్యాధునిక స్పై కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, బస్స్టాప్, ప్రార్థనా మందిరాలు, మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద షీ టీమ్స్ నిఘా కొనసాగుతున్నది. షీ టీమ్స్తో పాటు పెట్రోలింగ్ సిబ్బంది కూడా హాట్ స్పాట్స్ను గుర్తించి, అక్కడ నిరంతర నిఘాను పెంచారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి షీ టీమ్స్కు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.
డెకాయ్ ఆపరేషన్లతో..
రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. హాట్ స్పాట్ను గుర్తించి షీ టీమ్స్ నిఘాను కట్టుదిట్టం చేస్తాయి. ఆకతాయిలు, ఈవ్ టీజర్స్ చేష్టలను రికార్డు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. పండుగల సమయాల్లో షీ టీమ్స్ మరింతగా దూకుడు ప్రదర్శిస్తూ రద్దీలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని గుర్తించి పట్టుకుంటున్నారు. పక్కా ఆధారాలు ఉండటంతో న్యాయస్థానాల్లో ఈవ్ టీజర్స్కు శిక్షలు పడుతున్నాయి.
తెలిసిన వారే..
వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం బాధితులకు తెలిసిన వ్యక్తులే ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో ఉన్న పరిచయాలు, బంధువులు, స్నేహితులు.. ఏదో రకంగా పరిచయం ఉన్నవారి మధ్య విభేదాలు రావడంతో మనస్పర్ధలు పెరిగి.. కోపంతో సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
ఇందులో భాగంగానే వేధింపులకు పాల్పడుతూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పనిచేసే చోట కూడా కొందరు వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి వారు సైతం షీ టీమ్స్ను ఆశ్రయిస్తున్నారు. మీ కోసం మేమున్నాం.. వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100కు కాల్ చేయండి.. అంటూ షీ టీమ్స్ అధికారులు బాధితులకు భరోసా ఇస్తున్నారు.