సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన బీఏ277 విమానం లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3.26 గంటలకు బయలు దేరి, శుక్రవారం ఉదయం 5.25 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపారు.
అలాగే, షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ అరేబియాకు చెందిన జీ 9467 విమానాన్ని దారి మళ్లించారు. ఇండిగో విమానం 6ఈ 564 ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 5.33 గంటలకు బయలుదేరగా, దాన్ని చెన్నైకి దారి మళ్లించారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 5.30 బయలుదేరిన ఇండిగో విమానాన్ని (6ఈ 6923) సైతం చెన్నైకి మళ్లించారు. బ్లూడార్ట్కు చెందిన బీజెడ్ 486 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 4.32 బయలుదేరితే, శంషాబాద్లో దిగేందుకు అనుకూలంగా లేకపోవడంతో దాన్ని సైతం చెన్నైకి మళ్లించారు. వీటితో పాటు మొత్తం 23 విమానాల రాకపోకల షెడ్యూలు మారిపోయాయి.