బన్సీలాల్పేట్, జనవరి 11 : శాంతిభద్రతలకు విఘా తం కల్పిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులను ఆదేశించారు. మంగళవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని భోలక్పూర్, కృష్ణానగర్ ప్రాంతంలో ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ బస్తీలో కొందరు యువకులు గంజాయి తాగి, రాత్రి వేళల్లో రోడ్లపై కూర్చుని దారిన వెళ్లేవారితో గొడవలకు దిగుతున్నారని తెలిపారు. ఇటీవల ఇండ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అన్ని బస్తీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్రావును ఆదేశించారు. అక్రమంగా రోజుల తరబడి నిలిపిన వాహనాలను వెంటనే తొలగించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్రెడ్డిని ఆదేశించారు. బస్తీలో తిరుగుతూ, డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జలమండలి జీఎం రమణారెడ్డిని ఆదేశించారు. వెంటనే నూతన పైప్లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఎవర్గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పక్కన ఫుట్పాత్లపై ఆక్రమణలను, దుకాణాలను తొలగించాలని టౌన్ప్లానింగ్ ఏసీసీ క్రిస్టోఫర్ను ఆదేశించారు. వెంటనే వారు ఫుట్పాత్లపై ఆక్రమణలను, దుకాణాలను తొలగించారు. అక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత, టీఆర్ఎస్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్రాజు, నాయకులు ఏసూరి మహేశ్, రాంబాబు, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్రెడ్డి, వినోద్సింగ్, రాజశేఖర్, నాగరాజు, లావణ్య, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.