కొండాపూర్(హైదరాబాద్) : పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ , ఆర్టీసీ బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు. శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్తో కలిసి ఆదివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Arogyashri) – చేయూత, మహాలక్ష్మి సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అందుబాటులో ప్రభుత్వ దవాఖానలను నెలకొల్పారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ సేవలను రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.
పేదవారికి నయా పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించనున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, వెంకటేశ్గౌడ్, శ్రీనివాసరావు, జగదీశ్వర్గౌడ్, అధికారులు పాల్గొన్నారు.