మియాపూర్ , నవంబరు 24 : రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గంగానే కాకుండా ఐటీ రంగంలో దేశంలోనే 40శాతం ఉద్యోగాల కల్పనలో ప్రపంచ గుర్తింపు పొందిన శేరిలింగంపల్లి ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలంటే.. అధిక మెజార్టీతో గెలవాల్సింది కారేనని విప్, నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ అన్నారు. ఏ ఇతర పార్టీకి ఇంతటి పురోగతిని చూపించే కనీస ప్రణాళిక కూడా లేదని, వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. నియోజకవర్గం పరిధిలోని వివేకానందనగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన బాలకృష్ణ నగర్, పాపారాయుడు నగర్, రామారావునగర్ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావులతో కలిసి విప్ గాంధీ శుక్రవారం ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల సంఘాలు తమ సంపూర్ణ మద్దతు గాంధీకేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ ఏండ్ల తరబడి పాలించిన గత ప్రభుత్వాల హయాంలో శేరిలింగంపల్లి పూర్తిగా కుంటుపడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కేవలం పదేండ్లలోనే రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, విశేష అభివృద్ధితో రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 9 వేల కోట్లతో ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదన్నారు. ఈ అభివృద్ధిని ముందుకు కొనసాగించుకునేందుకు మూడోసారి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని, ఇంతకు మించిన అభివృద్ధిని చూపుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం ప్రతి గడపను అందాయని, తద్వారా ప్రజలలో ఎంతో సంతోషం, సంతృప్తి నెలకొన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.