కవాడిగూడ, నవంబర్ 20 : సీనియర్ జర్నలిస్ట్, ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రం నర్సింగ్రావు సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నర్సింగ్ రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం బన్సీలాల్పేటలోని హిందూ శ్మశాన వాటికలో నర్సింగ్రావు అంత్యక్రియలు జరిగాయి. నర్సింగ్ రావు కుమారుడు పవన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
పలువురు ప్రముఖుల నివాళి..
సీనియర్ పాత్రికేయులు ఎర్రం నర్సింగ్ రావు మరణ వార్త తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థి పూస రాజు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, రామకృష్ణ మఠం స్వామీజీ బోధమయా నంద, శితికంటా నంద, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్లు వి. శ్రీనివాస్ రెడ్డి, వాజీద్ హుస్సేన్తో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు, పెద్దఎత్తున జర్నలిస్టులు, నర్సింగ్రావు మృతదేహాన్ని సందర్శించి.. పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.