సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాత చట్టం ప్రకారమే బోర్డు ఎన్నికలు నిర్వహించనున్నదని, ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నదని పలువురు చెబుతున్నారు.
ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాపై బోర్డు అధికార యంత్రాంగం కసరత్తు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తున్నది. 2015లో బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు తీరింది. అనంతరం కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. అయితే, బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని న్యాయస్థానాలు కూడా కంటోన్మెంట్ బోర్డును ఆదేశిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు గానూ విధి విధానాలపై కొన్నిరోజుల కిందట కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ ఊపందుకుంటుందనుకున్న తరుణంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి రావడం గమనార్హం.