మారేడ్పల్లి, జూలై 15: ఇచ్చాపురం నుంచి ముంబైకి రైల్లో గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 3 లక్షల 50 వేల విలువ చేసే 35 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం….ఒడిషా రాష్ట్రం, గణపతి జిల్లా, మోహన గ్రామానికి చెందిన ఎలాన్ బిర్ (24) ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 13న నిందితుడు ఎలాన్ బిర్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు చేరుకోగా అక్కడ గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి లగేజీ బ్యాగ్లలో 35 కేజీల గంజాయి ప్యాకెట్లను అందజేశారు. అదే రోజు రాత్రి 6 గంటలకు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ కోచ్లో గంజాయి బ్యాగ్లను తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా మహారాష్ట్ర లోని ముంబైకి వెళ్తున్నాడు. కాగా కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 14న మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ పారం నెంబర్ 10 లోకి చేరుకుంది. రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసు సిబ్బంది రైలును తనిఖీ చేయగా నిందితుడు అనుమానాస్పదంగా కనించడంతో…బ్యాగ్లను చెక్ చేయగా అందులో 35 కిలోల గంజాయిని గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులు నిందితుడు ఎలాన్ బిర్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఇచ్చాపురం నుంచి ముంబైకి గంజాయిని తీసుకెళ్తున్నట్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ మసీదు, మునీశ్వర్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.