మారేడ్పల్లి, ఫిబ్రవరి 17: రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకు చెందిన 6 మంది ముఠా సభ్యుల నుంచి రూ.10 లక్షల విలువైన 66 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, 10వేల నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే ఎస్పీ షేక్ సలీమా కేసు వివరాలు వెల్లడించారు.
తుక్కుగూడ ప్రాంతానికి చెందిన బోనగంటి చైతన్య (26), అమీర్పేటలోని ఎల్లారెడ్డి గూడకు చెందిన ఎండీ రిజ్వాన్ హుస్సేన్ (34), కర్ణాటకకు చెందిన మాణిక్ ప్రకాశ్ అలియాస్ బాలు (22), బంజారాహిల్స్కు చెందిన యోగి శంకర్ యాదవ్ (35) రైళ్లలో అమాయక ప్రయాణికులను టార్గెట్ చేసి సెల్ఫోన్లు, ల్యాప్టాప్, నగదును దొంగిలిస్తున్నారు. చోరీ చేసిన మొబైల్స్ను కాటేదాన్కు చెందిన నడికుడి మాణిక్యం (44), అఫ్జల్గంజ్కు చెందిన సురేందర్ సింగ్ రాజ్పుత్ (26)కు అమ్ముతున్నారు. వీరు మహారాష్ట్రకు చెందిన గణేశ్ దిలీప్ పాటిల్ (42)కు అమ్మి సొమ్ము చేసుకొని తప్పించుకొని తిరుగుతున్నారు.
శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఓ ముఠాగా ఏర్పడి రైళ్లలో సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మహారాష్ట్రకు చెందిన గణేశ్ దిలీప్ పాటిల్ (42) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సులువుగా గుర్తించవచ్చని రైల్వే ఎస్పీ షేక్ సలీమా సూచించారు. ఈ సమావేశంలో రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీతో యువతులను బ్లాక్మెయిల్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఖమ్మం జిల్లా కొత్తగూడం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(35) తరచూ నకిలీ ఇన్స్టా ఐడీతో యువతులను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన ఓ యువతితో వీడియో కాల్స్ మాట్లాడాడు. స్క్రీన్ రికార్డింగ్ చేయడంతో పాటు అశ్లీల దృశ్యాలుగా మార్ఫింగ్ చేసి యువతిని బెదిరించాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను కుటుంబ సభ్యులకు, బంధువులకు పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్క్రైమ్ పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.