కంటోన్మెంట్, ఆగస్టు 26: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే సాయన్న డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ బృందానికి ఏకరువు పెట్టారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని గురువారం పార్లమెంటరీ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ బృందం సందర్శించింది. తొలుతగా ఏఓసీలో అధికారులతో సమావేశమయ్యారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే సాయన్న హాజరయ్యారు. ఈ క్రమంలో డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జావల్ ఓరంకు కంటోన్మెంట్కు చెందిన పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కమిటీ చైర్మన్కు సర్వీస్ చార్జీల బకాయిలతో పాటు పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న బోర్డుకు రక్షణ శాఖ నుంచి రావాల్సిన సుమారు రూ. 600 కోట్ల పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు.
పెండింగ్లో ఉన్న సర్వీస్ చార్జీలను కూడా విడుదల చేస్తే బోర్డు పరిధిలో ఉన్న బస్తీలను మరింత అభివృద్ధికి వీలుంటుందన్నారు. అదే విధంగా బోర్డు పరిధిలోని రసూల్పురాతో పాటు పలు బస్తీల్లో తొలగించిన ఓట్లను పునరుద్ధరిస్తూ భవనాలకు సంబంధించి బైలాస్ వంటి ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. చిన్నకమేళా, నెహ్రూ సెంచరీ కాలనీ, మడ్ఫోర్ట్, నందమూరినగర్, 108 బజార్, సెంట్రల్ బ్యాటరీ, బోయిన్పల్లిలోని శివ టెంపుల్ ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు కనీసం బాత్రూమ్లు కూడా కట్టుకోనివ్వడం లేదన్నారు.
మరోవైపు బీ3, బీ4 స్థలాల్లో నివసిస్తున్న వారికే పట్టాలు ఇవ్వాలని, నివాస ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఖాళీగా ఉన్న బీ4, ఎ2 ల్యాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే అక్కడ పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీంతో పాటు చీటికి మాటికి ఆర్మీ అధికారులు రోడ్ల మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలగిరిలో ఉన్న డంపింగ్ యార్డును తక్షణమే తరలించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. బొల్లారం ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిటీ చైర్మన్ను కోరారు. జీహెచ్ఎంసీలో మాదిరిగా బీఆర్ఎస్, బీపీఎస్ను కంటోన్మెంట్లో ప్రవేశపెడితే బోర్డుకు సుమారు రూ. 400 కోట్ల ఆదాయం వచ్చే వీలుందన్నారు. సమావేశం అనంతరం కంటోన్మెంట్కు చెందిన టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు లోక్నాథం, పాండుయాదవ్, నళినికిరణ్లు కమిటీ చైర్మన్ జావల్ ఓరంకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి చేసిన మంత్రాంగం బెడిసికొట్టిందనే ప్రచారం జరుగుతుంది. అసలే ఏం జరిగిందంటే…… 23 మందితో కూడిన పార్లమెంటరీ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ బృందం గురువారం కంటోన్మెంట్ ప్రాంతాన్ని సందర్శించింది. ఈ క్రమంలో మొదటగా అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం కాకుండా కొంత ఆలస్యంగా మొదలైంది. ఇదిలా ఉండగా ఏఓసీలో సమావేశమైన కమిటీ బృందం ఎవరినీ కలిసేందుకు ఇష్టపడలేదు. సమావేశం అనంతరం భారీ బందోబస్తు మధ్య బొల్లారంలో ఉన్న దవాఖానను సందర్శించి కేవలం ఐదు నిమిషాల్లోనే వెనుదిరిగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కంటోన్మెంట్ వికాస్ మంచ్ సంస్థ సభ్యులు కమిటీ బృందం రాక నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ప్ల్లకార్డులు ప్రదర్శించారు.