సిటీబ్యూరో/సికింద్రాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పజ్జన్న. ఇది పేరు మాత్రమే కాదు నిరుపేద గుండెల్లో ఓ ధైర్యం. ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ భరోసానిచ్చే ఓ నమ్మకం. అందుకే పజ్జన్న అంటే గ్రేటర్ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. ఇంట్లో మనిషిలా ఆరాధిస్తారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం పజ్జన్నతో అభిమానంగా నడుచుకుంటారు. ఉద్యమ రథ సారథి కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన పజ్జన్న.. ప్రతి ఎన్నికల్లో విజయ దుందుభీ మోగిస్తూ రికార్డు సృష్టిస్తున్నారు.
సాధారణ కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులను నిర్వర్తించి రాష్ర్టా నాయకుడిగా ఎదిగారు ప్రస్తుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్. ఇప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచి తన సత్తా చాటారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో ఎంపీగా గెలిచి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
2001లో ఉద్యమ రథసారథి కేసీఆర్ పిలుపు మేరకు పద్మారావుగౌడ్ బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2002 నుంచి 2004 వరకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా చేశారు. అనంతరం 2004లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో అదే స్థానం నుంచి రెండో సారి ఎన్నికయ్యారు. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రిగా ఉన్నారు.
2018లో సికింద్రాబాద్ నుంచి మూడోసారి 50వేలకు పైగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 2023 ఎన్నికల్లో మరోసారి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వంలో సుమారు 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. తుకారాంగేట్ ఆర్యూబీ, సీతాఫల్ మండీ డిగ్రీ, జూనియర్ కాలేజీ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ఉచిత శిక్షణ ఉపాధి అందించే సెట్విన్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
తీగుళ్ల పద్మారావు తెలంగాణ ఉద్యమ కారుడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రజలను వేలాదిగా సమీకరించి..ఉద్యమంలో పాల్గొన్నారు. రాస్తారోకో, రైల్రోకోలో కేటీఆర్తో కలిసి ఉద్యమించారు. ఆయనపై తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు నమోదయ్యాయి. కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేశారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. పద్మారావును ప్రజలు పజ్జన్న అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. పదేండ్ల తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేపట్టి ప్రజల మన్ననలు పొందారు.
పద్మారావు గౌడ కులానికి చెందిన వారు. సికింద్రాబాద్లో మోండా మార్కెట్లోని టకార బస్తీవాసి. తల్లిదండ్రులు ఈశ్వరయ్య, రాములమ్మ. బస్తీవాసులతో ఆయనకు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. వారంతా పద్మారావు అభిమానులుగా ఉన్నారు. పేద కుటుంబంలో జన్మించిన పద్మారావు అంచెలంచెలుగా రాజకీయాల్లో రాణించారు.