Padma Rao Goud | బేగంపేట్, ఏప్రిల్ 6: కాంగ్రెస్ చెప్పిన పథకాలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గెలిచిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, నగరంలో నీటి, కరెంటు కొరత బాగా పెరిగిపోయిందని చెప్పారు. కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి.. పద్మారావుగౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, కొలన్బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.