సోషల్ పుకార్లను నియంత్రించేలా.. శాంతిభద్రతలకు సహకరించేలా
స్థానిక యువత భాగస్వామ్యంతో కమిటీలు
శాంతిదళాలకు సాయంగా పీస్ కమిటీలు
మతసామరస్యాన్ని కాపాడుకుందాం..
నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. పోలీసుస్టేషన్, సెక్టార్ల వారీగా స్థానిక శాంతిభద్రత కమిటీల (పీస్) సహకారంతో వీటిని నియమించాలని డీసీపీలను ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులకు చెక్ పెట్టడంతోపాటు ప్రశాంత వాతావరణానికి భంగం కలుగకుండా శాంతిదళాలు పనిచేస్తాయి. అంతేకాకుండా ఏదైనా ఘటన జరిగితే స్థానికంగా కీలక సమాచారం సేకరించడం, పరిస్థితిని నియంత్రించడం, సంబంధిత వ్యక్తులకు సహాయం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఎక్కువమంది యువకులతో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి, సభ్యులతో ఉన్నతాధికారులు తరచూ చర్చలు జరపనున్నారు.
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్టార్ల వారీగా శాంతి దళాల ఏర్పాటుకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శ్రీకారం చుట్టారు. సామాజిక మాధ్యమాల్లో శాంతికి భంగం కలిగేలా.. వర్గాల మధ్య రెచ్చగొట్టేలా వచ్చే అబద్ధపు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఇవి ఉయోగపడనున్నాయి. ఇందు కోసం పీస్ కమిటీల్లోకి సెక్టార్ల వారీగా యువతను తీసుకొని, వారిని సీనియర్ల మార్గనిర్దేశంలో తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య శాంతికి వారధిగా ఉంటున్న సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సమావేశం గురువారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగింది. నగరంలో పండుగల సీజన్ ప్రారంభం కానుండడంతో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగకుండా ఉండేందుకు పోలీసులు అందరి సహకారం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ నగరం మత సమరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని, శాంతి కమిటీల్లోకి యువతను చేర్చుకోవాలని, తద్వారా సోషల్మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాలకు చెక్ పెట్టాలని సూచించారు. సామాజిక మాధ్యమాలపై నగర పోలీసులు నిఘా పెంచారని, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు రమేశ్, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.