సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా నగరంలో మళ్లీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాతావరణం ఉన్నట్లుండి చల్లబడటం, తేలికపాటి వానలు కురవడంతో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు శీతాకాలంలో వచ్చే సీజనల్స్తో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా న్యుమోనియా వ్యాధికి గురయ్యే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు.
దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కు ప్రతిరోజు సుమారు 80నుంచి 100కు పైగా ఓపీ కేసులు వస్తున్నాయని, చిన్నపిల్లలకు సంబంధించి ప్రతి రోజు 50 న్యుమోనియా కేసులు వస్తుండగా అందులో ఒకటి లేదా రెండు కేసులను అడ్మిట్ చేసుకుంటున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్లోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ముందస్తు వైద్య సేవలను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. బస్తీ దవాఖానలు, ఏరియా, జిల్లా దవాఖానల దగ్గర నుంచి ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ వరకు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అన్నిరకాల సీజనల్ వ్యాధులకు సంబంధించిన వైద్యం అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.