సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుల పరిశీలన దాదాపుగా పూర్తి అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో 709718 దరఖాస్తులను స్వీకరించగా.. ఇందులో 344310 (48.51 శాతం) మంది వివరాలను పరిశీలించారు. ఆధార్, ఓటర్ కార్డు వివరాల ఆధారంగా సంబంధిత యాప్లో అప్లోడ్ పూర్తి చేశారు.
మిగిలిన 365408 దరఖాస్తుల వివరాలను అధికారులు అప్లోడ్ చేయలేకపోయారు. దీనికి కారణం సదరు దరఖాస్తుదారులు దరఖాస్తుల్లో చిరునామాలు ఇవ్వకపోవడం, పొందుపర్చిన ఫోన్ నంబరు అందుబాటులో లేకపోవడం..ఫోన్ చేసినా స్పందించకపోవడం..చాలా వరకు ఇండ్లు మారడం..ఇతర ప్రాంతాలకు వెళ్లడం..కొందరు చనిపోవడం లాంటి తదితర కారణాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఎక్కువ శాతం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే దరఖాస్తులు చేసుకున్నట్లు పరిశీలనలో తేలింది. ఇదే అంశంపై త్వరలో సమగ్ర నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తగు చర్యలు తీసుకోనున్నారు.