మేడ్చల్, జనవరి 31: జవహర్నగర్ కార్పొరేషన్లో స్క్రాప్ దుకాణాలు రోజుకోకటి వెలుస్తుంది. కండ్ల ముందే అగ్ని ప్రమాదాల ఘటనలు ఎన్నో చూస్తున్నాం… ప్రమాదం మనవద్దకు రాకముందే గుర్తిస్తే బాగుంటుందని జవహర్నగర్ ప్రజలు వేడుకుంటున్నారు. కార్పొరేషన్లోని 100కాలనీల్లో 400పైగా స్క్రాప్ దుకాణాలు విచ్చలవిడిగా ఇండ్ల మధ్యలో వెలిశాయి. స్క్రాప్ను తుక్కుగా చేసే క్రమంలో భారీ శబ్దాలు రావడంతో కాలనీల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
దొంగ సామాన్లకు అడ్డాగా మారుతున్న జవహర్నగర్
స్క్రాప్ దుకాణాదారులు రాత్రి వేళల్లో దొంగ సామాన్లను కొని నగరానికి తరలిస్తున్నారు. బైకులు, ఇతర వాహనాలను దొంగతనం చేసి కార్పొరేషన్కు తీసుకురాగా రాత్రికిరాత్రే ఆనవాలు లేకుండా చేస్తూ అక్రమంగా కోట్లల్లో సొమ్ము చేసుకుంటున్నారు.
అగ్నిప్రమాదం జరిగితే..
ఎండాకాలం ముంచుకోస్తుంటే స్క్రాప్ దుకాణాదారులు ఎలాంటి నిబంధలు పాటించకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో గబ్బిలాల్పేటలోని ఓ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో భారీ మొత్తంలో స్క్రాప్ బుడిదవగా, చుట్టు పక్కల నాలుగు ఇండ్లల్లో భారీ నష్టం ఏర్పడింది.
కార్పొరేషన్లోని ఇండ్ల మధ్యలో ఉన్న దుకాణాలపై చర్యలు తీసుకుంటే నష్టం సంభవించదని, లేకుండా పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కాలనీవాసులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.
కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండి
వ్యాపారాలు చేయాలంటే తప్పకుండా ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉండాలి. జవహర్నగర్ కార్పొరేషన్ అక్రమంగా స్క్రాప్ దుకాణాలు నడిపిస్తూ రూ. కోట్లలో అర్జిస్తున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం వాణిజ్య వ్యాపారాలు నిర్వహించే వారు ఆన్లైన్ ద్వారా వ్యాపార లైసెన్సు పొందాలి. లైసెన్సులు లేకుండా పెద్ద షెడ్డుల్లో స్క్రాప్ దుకాణాలు నడిస్త్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమంగా వెలుస్తున్న స్క్రాప్ దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జవహర్నగర్ వాసులు కోరుతున్నారు.
అక్రమ దుకాణాలను వెంటనే తొలగిస్తాం
అక్రమంగా నిర్వహిస్తున్న స్క్రాప్ దుకాణాలను వెంటనే తొలగిస్తాం. వాణిజ్య వ్యాపారాలు నిర్వహించే వారు మున్సిపల్ చట్టం ప్రకారం లైసెన్సులు పొందాలి. కాలనీల్లోని ఇండ్ల మధ్యలో స్క్రాప్ దుకాణాలను ఏర్పాటు చేయొద్దు. వెంటనే మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపుతా. పెను సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతాం.
-కమిషనర్ రామలింగం, జవహర్నగర్ కార్పొరేషన్