ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి వీలుగా విద్యా శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ముషీరాబాద్ మండలం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి తెరవడానికి అధికారులు, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి.
మరోవైపు కోర్టు అత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ క్లాసుల నిర్వహణను కొనసాగించాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు చాలా కాలం తరువాత పాఠశాలలు ప్రారంభమవుతుండటంతో ప్రభుత్వం పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు,కొవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి పలు జాగ్త్రలు తీసుకుంటున్నారు.
ముషీరాబాద్ మండలం పరిధిలో 7 ఉన్నత, 22 ప్రాథమిక పాఠశాలలు, 14 ఏయిడెడ్, 150 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. పాఠశాలల్లో పెరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కల తొలగింపు, దుమ్ము, దూళి శుభ్రం చేసి తరగతి గదుల్లో శానిటైజేషన్ చేశారు. మూత్ర శాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రైవేటు పాఠశాలల్లో సైతం ఏర్పాట్ల తీరును అధికారులు పరిశీలిస్తున్నారు.
విద్యార్థుల హాజరు శాతంతో నిర్ణయం…
ప్రభుత్వ పాఠశాలల్లో 4900 మంది విద్యార్థులు చదువుతుండగా కొవిడ్ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ క్లాసుల నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ఆన్లైన్ క్లాస్లు కొనసాగిస్తూనే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఆధారంగా క్లాసుల నిర్వహణకు ప్లాన్ చేశారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా..
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ కొనసాగుతుంది. ఆన్ లైన్ బోధన కొనసాగిస్తూనే ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విద్యార్థుల హాజరు తీరునుబట్టి షిప్టుల వారిగా సామాజిక దూరం పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపట్టడం జరుగుతుంది.