సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్స్ నగరంలో హద్దు మీరుతున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, తమకు నచ్చినట్టుగా విద్యాబోధనలో మార్పులు చేస్తూ పేట్రేగిపోతున్నాయి. తాజాగా సైదాబాద్లో ఓ టీచర్ 2వ తరగతి చదువుతున్న విద్యార్థికి నిబంధనలకు విరుద్ధంగా కల్మా రాయాలని హోంవర్క్ ఇవ్వడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చిన్నారి డైరీలో కల్మా కంఠస్థం చేయాలంటూ హోం వర్క్ ఇవ్వడంతో గురువారం తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అప్పటికే విద్యార్థి సంఘాలు ఆ స్కూల్ ఎదుట నిరసన చేపట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. విద్యార్థి సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు వ్యాన్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు.
అనంతరం స్కూల్ యాజమాన్యం.. వివాదానికి కారణమైన టీచర్ను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు ప్రకటించింది.. నిబంధనలకు పాతర పాఠశాల స్థాపించాలంటే విద్యాశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మద్యం దుకాణాలు, ప్రార్ధన మందిరాలకు పాఠశాల దూరంగా ఉండాలి. 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. భవన రిజిస్ట్రేషన్, ఫైర్ సేఫ్టీ తప్పనిసరి. అయితే నగరంలో చాలా పాఠశాలలను కేవలం లాభార్జన మీదనే నెలకొల్పుతున్నారు. హైదరాబాద్లో మొత్తం 2,374 ప్రైవేట్ స్కూళ్లు ఉంటే ఇందులో 1,897 పాఠశాలలకే గుర్తింపు ఉంది.
ఈ విషయం విద్యా శాఖాధికాల దృష్టిలో ఉన్నప్పటికీ డీఈఓ, డిప్యూటీ ఈఓఎస్లు, డిప్యూటీ ఐఓఎస్లు మౌనం వహిస్తున్నారు. విద్యాశాఖ ప్రమాణాలు పాటించకుండా, వివిధ శాఖల నుంచి అనుమతి తీసుకోకుండా పాఠశాలలను నిర్వహిస్తున్నా తమకు పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తిచేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారని ఫిర్యాదులు అందినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మామూళ్లు అందడంతో అధికారులు అటువైపునకు తొంగి చూడటం లేదనే ఆరోపణులన్నాయి.