Congress | కవాడిగూడ, మార్చి 15: విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు గ్రాంట్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి ఆపుతుందని బాధిత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వం స్కాలర్ షిప్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నదని, దీని కారణంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యిందని బాధిత విద్యార్థులు శంకర్ కుమార్, బద్రీ రాథోడ్, జమున, లకావత్ మాన్సింగ్, రాంబాబు, తులసీరామ్, భాస్కర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇందిరా పార్కు ధర్నాచౌక్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తల్లిదండ్రుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య చదువు కోసం ఏర్పాటు చేసిన పథకం అని, ఆ పథకం ప్రకారం విదేశీ విద్యా చదువుకోవడానికి ఎంత మంది వెళ్లినా సంతృప్తి స్థాయిలో స్కాలర్ షిప్లను ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించి నిధులు మంజూరు చేసిందన్నారు. కాని, ప్రస్తుతం విద్యార్థులకు గ్యాప్ వచ్చిందని, ఇతరత్రా అనేక కారణాలు చూపి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. తాజా లెక్కల ప్రకారం, 206 మంది విద్యార్థులు విదేశాలకు వెళితే, 136 మంది విద్యార్థుల హార్డ్ కాపీ సబ్మిషన్కు అంగీకరించి, 126 మందిని ఇంటర్వ్యూ చేసి 63 మందిని సెలెక్ట్ చేసిందని, మిగతా 143 మందిని రిజెక్ట్ చేసిందని అన్నారు.
జీఓ నం. 36 ప్రకారం, ఒక ఎస్టీ విద్యార్థి 35 ఏండ్ల వరకు ఉన్నత విద్య చదవడానికి అర్హుడని, దీన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదని వారన్నారు. దీని వల్ల విదేశాల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులు తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి బాగాలేక ఇంటి నుంచి డబ్బులు రాక, ప్రభుత్వం ఇవ్వక, బ్యాంకుల నుంచి లోన్లు రాక నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఎస్టీ విద్యార్థులకు రావాల్సిన అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయీలను వెంటనే చెల్లించాలన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్ షిప్ను రూ.40 లక్షలకు పెంచాలన్నారు. ఎంత మంది విదేశాలకు వెళ్లి చదివితే అంత మందికి స్కాలర్ షిప్లను ఇవ్వాలని అన్నారు. మార్కుల పేరుతో విద్యార్థుల సంఖ్యను 5 వరకు తగ్గించడాన్ని మానుకోవాలన్నారు. వివిధ కారణాలతో గ్యాప్ వచ్చిన విద్యార్థులను కూడా పరిగణనలోకి తీసుకొని స్కాలర్ షిప్లను ఇవ్వాలన్నారు. సీఎం వెంటనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్లపై సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.