సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పాస్పోర్టు దరఖాస్తుదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… షహీన్ బేగం సుల్తానా తన మనువడికి పాస్పోర్టు కోసం 2025 జూన్లో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
అయితే దరఖాస్తు పెండింగ్లో ఉండడంతో 2025 నవంబర్లో ఆర్పీవో కార్యాలయానికి వెళ్లారు. పాస్పోర్టు కార్యాలయం వద్ద శివరాత్రి సిద్దులు అనే వ్యక్తి ఆమెను కలిశాడు. తాము పాస్పోర్టును వేగంగా ఇప్పిస్తామంటూ నమ్మబలికి, రూ. 6 వేల నగదు వసూలు చేశారు. ఇక మీరు పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లవద్దని, మీరు వెళ్లి వాకబు చేస్తే పాస్పోర్టు ప్రక్రియపై ప్రభావం పడుతుందని ఆమెను భయపెట్టాడు.
అయితే రోజులు గడుస్తున్నా పాస్పోర్టు రాలేదు, దీంతో ఈనెల 4న సిద్దులును బాధితురాలు సంప్రదించగా, మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. అదనంగా డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు అవుతాయంటూ ఆమెను బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి, పాస్పోర్టు కార్యాలయం వద్ద అమాయకులను మోసం చేస్తున్న శివరాత్రి సిద్దులుతోపాటు అతని అనుచరులు తమ్ముల వెంకటేష్, వరికుప్పల అశ్విన్కుమార్, పల్లెపు దీపక్లను అరెస్ట్ చేశారు.