సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మహానగర వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) హైటెక్ బాటపడుతున్నది. సాంకేతికత వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా)లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. కూర్చున్న చోటు నుంచే క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాపై కచ్చితమైన నియంత్రణ కలిగి ఉండే ఈ వ్యవస్థను అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 2014 నుంచి 2022 వరకు రూ.12 వేల కోట్లను మౌలిక వసతుల కోసం వెచ్చించారు.
నాణ్యమైన సరఫరా….
తెలంగాణలో కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉంది. దీన్ని గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సరఫరా చేసేందుకు అవసరమైన వసతులను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారించాం. ఎనిమిదేండ్లలో కొత్తగా సబ్ స్టేషన్ల నిర్మాణం, 33/11 కేవీ లైన్ల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 11 కేవీ లైన్లను భూగర్భంలోంచి వేయడం వంటి పనులను చేపట్టాం. దాని ఫలితంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మించి నెట్వర్క్ను విస్తరిస్తున్నాం. వీటన్నింటితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరా నిర్వహణపై స్కాడా పరిజ్ఞానం సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 486 సబ్స్టేషన్లు ఉండగా, అందులో 226 సబ్స్టేషన్లను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చాం. అలాగే 167 ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్లను డీఎంఎస్ (అధునాతన డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టం) పరిధిలోకి తీసుకురావడంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడింది.
–జి.రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్ఎస్పీడీసీఎల్
ప్రతి దశలో ఆటోమేటెడ్
ఉత్పత్తి మొదలు విద్యుత్ పంపిణీ వరకు ప్రతి దశలో అధికారులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇది ఓ విధంగా ఆటోమేషన్ ప్రక్రియగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్కాడా వోల్టేజీ హెచ్చుతగ్గులు, రివర్స్ విద్యుత్ సరఫరాలను నియంత్రించడంతో పాటు అంతరాయాలు, లోపాలను గుర్తిస్తుంది. సరఫరాలో నాణ్యతను మెరుగుపర్చడం ఈ వ్యవస్థలోని ప్రత్యేక లక్షణం. మానవ ప్రమేయం లేకుండానే సబ్ స్టేషన్ల నిర్వహణ చేపట్టవచ్చు. ప్రస్తుతం ఈ జాబితాలో కళ్యాణ్నగర్, ముఫకంజా, శిల్పారామం, కృష్ణానగర్, నాగోల్ సబ్స్టేషన్లు ఉన్నాయి.