రవీంద్రభారతి, ఏప్రిల్ 21: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఇందుకు నిదర్శనమని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో బాబూ జగ్జీవన్రాం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్, బీఆర్ఎస్ నేత కొమ్ముల నరేందర్ అధ్యక్షతన నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు, మహా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ నిర్వహించారు.
సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించడం గొప్ప విషయమని చెప్పారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పాలకులు దళితులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎనిమిది ఏండ్లుగా పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం దళితులకు చేసింది శూన్యమని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దళిత, బహుజనుల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న దళితులు అభివృద్ధి చెందే రోజులు ఉన్నాయని ఆశాభావం వక్తం చేశారు. దళితుల అభివృద్ధికి పాటుపడుతున్న జాతిపిత సీఎం కేసీఆర్ అని కొమ్ముల నరేందర్ కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఏపీ బీఆర్ఎస్ నాయకులు రావెల కిశోర్బాబు, నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం, బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్యాదవ్, మేరు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ మేరు, సాయిచంద్, బత్తిని శ్రీలతగౌడ్, కొమ్ముల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.