సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ముత్యాల ముగ్గులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె.రజనిప్రియ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి సంబురాలు’ పేరుతో సాంస్కృతిక, సంప్రదాయ వంటల కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగింటి ఆడపడుచులు రంగవళ్లులు ఆవిష్కరించడంతో సందడి నెలకొంది. ఓవైపు ముగ్గులు, మరోవైపు వంటలతో సందర్శకుల కోలాహలం సంతరించుకున్నది. ముగ్గులు, వంటలు, సంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. వంటల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చెఫ్ రామరాజు, డాక్టర్ అర్చన హాజరయ్యారు.