అమీర్పేట్, జూన్ 2: పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకు ఏకం అవుతున్న తెలంగాణ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తం గా ఉండాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి నేతృత్వంలో సత్యం ధియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే తలసాని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వంలో.. తెలంగాణ అస్తిత్వానికి ముప్పు తెస్తున్న శక్తుల కుట్రలను తిప్పికొడతామని పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులతో కలిసి తలసాని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా 2001లో ఉద్యమ నేత కేసీఆర్ మార్గదర్శకంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు ముందు వరుసలో ఉంటూ పోరాడిన బొడ్డు శ్రీనివాస్గౌడ్, బీఆర్ నారాయణరాజు, మోహన్బాబు, జోగిందర్సింగ్, బల్వీందర్సింగ్ (పప్పు),అతిఖ్, నాని, సంపత్, కృష్ణ తదితరులను తలసాని ఘనంగా సన్మానించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. పాలన చేతగాని కాంగ్రెస్కు పట్టం గట్టి తప్పు చేశామనే భావన తెలంగాణ ప్రజల్లో నెలకొందన్నారు. గాడి తప్పిన తెలంగాణను చక్కదిద్దేది ఉద్యమ నేత కేసీఆర్ మాత్రమేనని, మరోసారి కేసీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపడితేనే అది సాధ్యమని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంతోష్ మణికుమార్, దాడి ప్రవీణ్రెడ్డి, అశోక్యాదవ్, కూతురు నర్సింహ, బీ.ఆర్.నారాయరాజు, గుడిగె శ్రీనివాస్యాదవ్, సురేందర్గౌడ్ ఉన్నారు.