సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కంటివెలుగు కార్యక్రమానికి 5వ రోజు వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్ద తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో 36,361మందికి కంటి పరీక్షలు జరిపినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వారిలో 10,681 మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేయగా 5492 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.
హైదరాబాద్ జిల్లాలో…
హైదరాబాద్ జిల్లాలో 115 కేంద్రాల్లో 15,147మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. వారిలో 5532 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేశామని, 2131మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో…
జిల్లా పరిధిలో బుధవారం 80 కేంద్రాల ద్వారా 10,171 మందికి కంటి పరీక్షలు జరిపినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వారిలో 1897 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 1919 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు వివరించారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో….
మేడ్చల్ జిల్లా పరిధిలో 79కేంద్రాల ద్వారా 11,043 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు. వారిలో 3252మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 1442 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.